డ్రంకన్డ్రైవ్ కేసుల్లో పలువురికి జైలుశిక్ష
కామారెడ్డి క్రైం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల పోలీసులు డ్రంకన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పలువురు పోలీసులకు పట్టుబడ్డారు. వారిని పోలీసులు మంగళవారం స్థానిక కోర్టుల్లో హాజరు పర్చగా, 10 మందికి ఒకరోజు జైలు శిక్ష, వారితోపాటు మొత్తం 38 మందికి రూ.వెయ్యి చొప్పున జరిమానాలు విధించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమన్నారు. జిల్లాలోని అన్ని పీఎస్ల పరిధిలో క్రమం తప్పకుండా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
రామారెడ్డి: దివ్వాంగ విద్యార్థులు ఆత్మస్థైర్యంతో చదువు, ఆటపాటల్లో ముందుకు సాగాలని ఫిజియోథెరపిస్ట్ అక్షయ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం రామారెడ్డి బాలికల ఉన్నత పాఠశాలలో దివ్యాంగుల విద్యా వనరుల కేంద్రంలో ఫిజియోథెరపి క్యాంపు నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. క్రమం తప్పకుండా ఫిజియోథెరపి చేయడం వల్ల శారీరకవైకల్యాన్ని కొంతవరకు నయం చేసి సాధారణ విద్యార్థులతో కలిసి చక్కగా విద్యను అభ్యసించే విధంగా చేయవచ్చునని తెలిపారు. ఎంఈవో ఆనంద్ రావు మాట్లాడుతూ.. ప్రతి మంగళ, శుక్రవారాల్లో శిబిరాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు.
ధర్మారాం టోల్ ప్లాజాలో ఉచిత కంటి శిబిరం
పిట్లం(జుక్కల్): జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా హైవేస్ ప్రైవేట్ లిమిటెడ్, లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ సహకారంతో మంగళవారం ధర్మారాం టోల్ ప్లాజా వద్ద ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. ఎన్హెచ్ఏఐ ఆర్ఈ రవి శంకర్ మాట్లాడుతూ.. ప్రమాదాలను నివారించడంలో స్పష్టమైన దృష్టి ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం ద్వారా రోడ్డు భద్రతా అవగాహనను పెంచుతూ సమాజ కంటి ఆరోగ్యానికి ఈ చొరవ తోడ్పడుతుందన్నారు. ఎన్హెచ్ఏఐ టీఎల్ దినేష్ కుమార్, హన్సారియా, ఎస్సైలు వెంకట్రావు, అరుణ్ కుమార్, ఐఎంఎస్ మేనేజర్ రాజకుమార్, ఖాజా మొయినొద్దీన్, హన్మంతరావు, తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి గురుకుల పాఠశాలలో వైద్య శిబిరం
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో మంగళవారం ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. 200 మందికి పైగా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మందులు పంపిణీ చేశారు. వైద్యులు హరి, హరికృష్ణ, ప్రిన్స్పల్ సురేఖ, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
మల్లన్న ఆలయ వార్షికోత్సవాలు ప్రారంభం
తాడ్వాయి(ఎల్లారెడ్డి): బ్రహ్మాజీవాడిలోని మల్లికార్జున(మల్లన్న స్వామి)ఆలయంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పూజలను జరిపించారు. స్వామి వారి విగ్రహాన్ని గ్రామంలో ఘనంగా ఊరేగించారు. ఈ ఉత్సవాలు 29 వరకు జరుగుతాయన్నారు.
అయ్యప్ప స్వామి విగ్రహాల ఊరేగింపు
పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి పుష్కర కుంభాభిషేక మహోత్సవ విగ్రహాల ఊరేగింపును ప్రధాన వీధుల గుండా ఘనంగా నిర్వహించారు. వీధులన్నీ స్వామి నామస్మరణతో మారుమోగాయి. అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప మాలధారణ స్వాములు, భక్తులు పాల్గొన్నారు.
సంక్షిప్తం
డ్రంకన్డ్రైవ్ కేసుల్లో పలువురికి జైలుశిక్ష


