
హెల్త్ కార్డులు మంజూరు
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని బార్ అ సోసియేషన్ కార్యాలయంలో మంగళవారం న్యాయవాదులకు హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేశ్ మాట్లాడుతూ కార్డు ద్వారా రూ. 2 లక్షల వరకు ఉచితంగా వైద్యం పొందవచ్చన్నారు. హెల్త్ కార్డులు మంజూరు చేసిన సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. హెల్త్ కార్డు పరిమితిని రూ. 10 లక్షలకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బండారి సురేందర్రెడ్డి, అడిషనల్ పీపీ నిమ్మ దామోదర్రెడ్డి, ప్రతినిధులు అమృతరావు, బి.దామోదర్ రెడ్డి, గజ్జెల భిక్షపతి, లక్ష్మణ్రావు, ప్రదీప్రెడ్డి, రజనీకాంత్, కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ దేవరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
‘పౌష్టికాహారం అందించాలి’
కామారెడ్డి క్రైం : గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీరాణి సూచించారు. మంగళవారం జిల్లాకు వచ్చిన ఆమె కలెక్టరేట్లోని సంక్షేమ శాఖ అధికారి కార్యాలయాన్ని సందర్శించా రు. అధికారుల పనితీరు, అమలు చేస్తున్న పథకాలపై సమీక్షించారు. అనంతరం డ్రైవ ర్స్ కాలనీ, రాజీవ్నగర్ కాలనీల్లోని అంగన్వాడీ కేంద్రాలు, సఖి కేంద్రం, ప్రభుత్వ బాలికల వసతి గృహాలను సందర్శించారు. నిర్మాణంలో ఉన్న సఖి కేంద్రం భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకో వాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, సిబ్బంది పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణాపై కేసు
కామారెడ్డి క్రైం: ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. జుక్కల్ పోలీసులు మంగళవారం వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ ఇసుక ట్రాక్టర్ను పట్టుకున్నారు. డ్రైవర్ ఘోరీని విచారించగా ఇసుక అక్రమ రవాణా వ్యవహారం బయటపడింది. జుక్కల్ మండలం సోపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో తహసీల్దార్ ద్వారా అనుమతి పత్రాలు పొంది మంజీర నుంచి ఇసుకను అక్రమంగా కర్ణాటక ప్రాంతానికి తరలిస్తున్నట్లు విచారణలో అంగీకరించారు. రూ.900 లకు వచ్చే ట్రాక్టర్ ఇసుకను రూ.9 వేలకు అమ్ముకుంటున్నారని తేలిందని ఎస్పీ పేర్కొన్నారు. ట్రాక్టర్ యజమాని మహమ్మద్ ఆదిల్ ఇక్కడి నుంచి కర్ణాటకకు చెందిన మదన్ సోపేంద్ర బీదార అనే వ్యక్తికి ఇసుకను పంపిస్తున్నాడని తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేశామని, ఇసుక ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని, డ్రైవర్ను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.
నేడు ఇందిరమ్మ ‘మార్కింగ్ మహా మేళా’
నిజామాబాద్అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల వేగవంతానికి నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ‘మార్కింగ్ మహా మేళా’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. బుధవారం ఒకే రోజు 831 ఇళ్ల నిర్మాణానికి మార్కింగ్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. ఏకకాలంలో ఇందిరమ్మ ఇళ్ల పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లాకు 17,301 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. అందులో 9,526 ఇళ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. ఇందులో బేస్మెంట్ లెవల్లో 5,043, రూఫ్ లెవల్లో 796, స్లాబ్ పూర్తయినవి 256 ఉన్నాయి. ఇందిరమ్మ లక్ష్యాన్ని చేరుకుని రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉండాలన్న లక్ష్యంతో కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు.