అమలాపురం టౌన్: వెన్నుపోటు పాలనతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిసారీ బీసీలను నిలువునా మోసం చేస్తున్నారని వక్తలు విమర్శించారు. చంద్రబాబు పాలనలో ప్రస్తుతం రాష్ట్రం ప్రమాదం అంచున ఉందని, ఈ మోసపూరిత సర్కారును జనాభాలో 52 శాతం ఉన్న బీసీలే కాపాడాలని పిలుపునిచ్చారు. స్థానిక యెండూరి ఫంక్షన్ హాలులో వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా రౌండ్ టేబుల్ సమావేశం ఆ విభాగం జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ నెల 27న రాజమహేంద్రవరంలో జరగనున్న ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల స్థాయి వైఎస్సార్సీపీ బీసీ గర్జన సభను విజయవంతం చేయాలని నేతలు కోరారు. వెన్నుపోటు పార్టీ, వెన్నుపోటు పాలనపై ఈ సభ చర్చిస్తుందని పార్టీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ చెప్పారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని బీసీలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు నాడు మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారని, ఆ తర్వాత సీఎం అయినప్పుడు ఎస్సీలను, తర్వాత బీసీలను, ఇప్పుడు రాష్ట్రాన్ని వెన్నుపోటుతో మోసం చేస్తున్నారని నౌడు వెంకటరమణ, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. బీసీలను చట్టసభలకు అత్యధికంగా పంపిన ఘనత వైఎస్ జగన్దేనన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో అత్యధిక పదవులు వరించేలా చేసిందీ ఆయననేనని చెప్పారు. ఎమ్మెల్సీ, ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్ కుడిపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ బీసీలే వెన్నెముక అని అబద్ధాల పాలన చేసే చంద్రబాబుకు అదే బీసీలు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్లు పొన్నాడ సతీష్కుమార్, పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ ప్రస్తుతం బీసీల మంత్రం జపిస్తున్న చంద్రబాబు బీసీలకు రిజర్వేషన్లు పెంచినట్లు కొత్త డ్రామాకు తెరతీశాడని, కోర్టులో నిలబడని బీసీల రిజర్వేషన్ శాతంపై అభూతకల్పనలతో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.
ప్రమాదం అంచున ఉన్న
రాష్ట్రాన్ని బీసీలే రక్షించాలి
27న రాజమహేంద్రవరంలో ఉమ్మడి
ఉభయ గోదావరి జిల్లాల స్థాయి
వైఎస్సార్సీపీ బీసీ సభ
బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్
వెంకటరమణ, మాజీ మంత్రి వేణు,
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు పిలుపు


