కాకినాడ క్రైం: కాకినాడ జిల్లాకు మంజూరైన మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ప్రారంభించారు. నేర పరిశోధనలో శాసీ్త్రయ ఆధారాల సేకరణను మరింత వేగవంతం చేయడానికి వాహనంలో అందుబాటులో ఉంచిన సాంకేతికత ఎంతో తోడ్పడుతుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. నేరం జరిగిన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించడం, డాక్యుమెంటేషన్ చేయడం, భద్రపరచడం, ప్రాథమికంగా పరిశీలించడం వంటి సేవలు ఈ వాహనం ద్వారా అందుబాటులోకి వస్తాయన్నారు.
ఉత్పాదక రంగాలకు
రుణాలు పెంచాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వ్యవసాయం, పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ ఇతర ఉత్పాదక రంగాలకు బ్యాంకు రుణాలు మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ సూచించారు. బ్యాంకర్లు, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వ్యవహరించి సమాజాభివృద్ధిలో కీలక భూమిక పోషించాలని చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం 2026–27 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకర్ల జిల్లా స్థాయి సమీక్ష కమిటీ, జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రుణాల మంజూరులో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు.
దివ్యాంగుల అర్జీల
తిరస్కరణపై నిరసన
ఆలమూరు: మండలంలోని పెదపళ్లకు చెందిన దివ్యాంగులైన ఇలపర్తి ఉమాదేవి, సుంకర శ్రీనివాసుకు పింఛన్ దర ఖాస్తులను తిరస్కరించడంపై ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దివ్యాంగులైన వారిద్దరూ సుమారు 90 శాతం అంగవైకల్యంతో తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. తమ పని సైతం తాము చేసుకోలేని స్థితిలో ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన సదరం సర్టిఫికెట్లో వారికి 90 శాతం అంగవైకల్యాన్ని నమోదు చేసినా ‘టెంపరరీ’ అని పేర్కొనడం వారి పాలిట శాపంగా మారింది. వారిద్దరూ ఆన్లైన్లో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోగా అవి తిరస్కరణకు గురయ్యాయి. దీనిపై ఆగ్రహం చెందిన దివ్యాంగుల కుటుంబ సభ్యులు గ్రామ పంచాయతీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. తమ ఆవేదనను కూటమి నేతల దృష్టికి తీసుకువెళ్ళినా పట్టించుకోలేదని వారు వాపోయారు. వైద్యారోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల అసలైన దివ్యాంగులకు టెంపరరీ సర్టిఫికెట్ మంజూరు చేయడాన్ని నిరసిస్తూ వారి కుటుంబ సభ్యులు పార్టీలకతీతంగా పలువురు నేతలను తీసుకువెళ్లి ఆలమూరులో తహసీల్దార్ కందుల కుశరాజు, ఎంపీడీఓ ఎ.రాజు, మండల ప్రత్యేక అధికారి లక్ష్మీ ప్రత్యూషకు ఫిర్యాదు చేశారు.
రేపు వైఎస్సార్ సీపీ
బీసీ సెల్ ‘జిల్లా’ సమావేశం
అమలాపురం టౌన్: వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా సమావేశం అమలాపురంలో ఆదివారం సాయంత్రం జరగనుందని ఆ విభాగం జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర శుక్రవారం తెలిపారు. కోనసీమ జిల్లా ఏర్పడిన తరువాత జరిగే బీసీ సెల్ తొలి సమావేశం ఇదేనని ఆయన చెప్పారు. పార్టీ జిల్లా బీసీ సెల్కు చెందిన నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.


