కాకినాడ రూరల్: రమణయ్యపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గైగోలుపాడులో శ్రీనివాసా ట్రేడర్స్కు చెందిన ఆయిల్ రీ ప్యాకింగ్ యూనిట్పై విజిలెన్స్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. 930 కేజీల ఆయిల్ను ఈ సందర్భంగా సీజ్ చేశారు. ఫుడ్ కంట్రోల్, జీఎస్టీ, లీగల్ మెట్రాలజీ, రవాణా, పంచాయతీ తదితర శాఖల అధికారులులీ తనిఖీల్లో పాల్గొన్నారు. లైసెన్స్, అనుమతులు తదితరాలను ఆయా శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయిల్ రీ ప్యాకింగ్కు సంబంధించి లోపాలను గుర్తించారు. ఎస్ఎస్ ఆరోగ్య రిఫైన్డ్ పామోలిన్ ఆయిల్, ఎస్ఎస్ గోల్డ్ఫిట్ సోయా ఆయిల్, సోయా ఆయిల్ లీజుగా రీ ప్యాకింగ్ చేసి హోల్సేల్ అండ్ రిటైల్లో విక్రయాలు చేపడుతున్నట్టు గుర్తించారు. గోల్డ్ ఫిట్ రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్పై సన్ప్లవర్ ఫొటో ఉన్నప్పటికీ అందులో ఉన్నది ఏ రకం ఆయిల్ అనేది పేర్కొనలేదు. దీంతో దానిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా కాకినాడ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఎన్.రమేష్బాబు మీడియాతో మాట్లాడుతూ యూనిట్ తనిఖీలో మూడు నమూనాలు సేకరించినట్టు చెప్పారు. సీజ్ చేసిన 930 కేజీల ఆయిల్ విలువ రూ.1.84 లక్షలు ఉంటుందన్నారు. లేబుల్ తప్పిదంపై జాయింట్ కలెక్టరు కోర్టులో కేసు పెట్టామన్నారు. దాడుల్లో విజిలెన్స్ సీఐ గోపాలకృష్ణ, జీఎస్టీ అధికారిణి శిరీష, ఎంవీఐ వెంకన్నబాబు, పంచాయతీ కార్యదర్శి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.


