కరప : కొరుపల్లిలోని కాశీ వారాహి అమ్మవారి ఆలయాన్ని దేవదాయ శాఖ స్వాధీనం చేసుకోవడంపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయం వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. ఈ నెల 15న అమ్మవారి ఆలయాన్ని దేవదాయ శాఖ స్వాధీనం చేసుకున్న విషయం పాఠకులకు తెలిసిందే. ఈ చర్యను నిరసిస్తూ ఒక మహిళా భక్తురాలు శుక్రవారం జరిగే సామూహిక కుంకుమ పూజలను అడ్డుకొని నిరసన వ్యక్తం చేస్తామని ప్రకటించడం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం అందించగా, కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ ఆధ్వర్యంలో కరప ఎస్సై సునీత, గొల్లపాలెం పెదపూడి ఎస్సైలతో పాటు పోలీస్ సిబ్బంది పహరా కాశారు. ఉదయం ఎనిమిది గంటల సమయంలో కొంతమంది మహిళా భక్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సింగల్ ట్రస్టీ రాపాక శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ ఫణీంద్ర కుమార్ మాట్లాడుతూ కాశీ వారాహి అమ్మవారి ఆలయాన్ని దేవదాయ శాఖ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఇక నుంచి ఆలయ ధర్మకర్త దొరబాబు నిర్వహించిన రీతిలోనే పూజా కార్యక్రమాలు, కుంకుమ పూజలు యథావిధిగా జరుగుతాయన్నారు.
కాశీ వారాహి అమ్మవారి ఆలయం వద్ద నిరసన


