వైఎస్సార్ విగ్రహానికి నిప్పుపెట్టిన కేసు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక కోటగుమ్మం సెంటర్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగుడిని మూడో పట్టణ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ విగ్రహానికి మంగళవారం గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టిన ఘటనపై స్థానిక వైఎస్సార్ సీపీ శ్రేణులు విగ్రహం వద్దకు చేరుకుని నినాదాలు చేసి, నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పోలీసులు దర్యాప్తు చేపట్టి విగ్రహానికి నిప్పు పెట్టింది ఆల్కాట్గార్డెన్స్ సమీపంలోని ఉల్లితోట వీధికి చెందిన టైల్స్ పనిచేసే గిరాడ చంద్రశేఖర్గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
మాజీ ఎంపీ భరత్ ఫిర్యాదు
జరిగిన సంఘటనపై మాజీ ఎంపీ భరత్రామ్ మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతికి ముందురోజు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారంటే ఎవరో కావాలనే చేశారని తెలుస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అడుగడునా సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతమైన కోటగుమ్మం వద్ద ఇటువంటి చర్యకు పాల్పడ్డ ఘటనపై తమ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారని తెలిపారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఇకపై మహానీయుల విగ్రహాల జోలికి రాకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు.


