కాకినాడ క్రైం: ఏపీ పారా మెడికల్ జేఏసీ పిలుపు మేరకు జీజీహెచ్లో పని చేస్తున్న కాంట్రాక్టు పారా మెడికల్ సిబ్బంది చేపట్టిన నిరసన కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా నల్లబ్యాడ్జీలతో సాగిన వీరి నిరసన శుక్రవారం రెండో దశకు చేరింది. బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వర్తించడంతో పాటు ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద సిబ్బంది నిరసన ప్రదర్శన చేపట్టారు. తమని రెగ్యులర్ చేయాలని, నూరు శాతం గ్రాస్ వేతనం ఇవ్వాలని, ఉద్యోగి మరణిస్తే రూ.50 లక్షల పరిహారం ఇచ్చి, కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇవ్వాలని, ఈపీఎఫ్ సదుపాయం కల్పించి, కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, రిక్వెస్ట్, మ్యూచువల్ బదిలీలకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


