కాకినాడ క్రైం: కనీసం 15 శాతం శిక్షణ భృతే (స్టైఫండ్) లక్ష్యమని జూడాలు నినదించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా కాకినాడ ఆర్ఎంసీ జూనియర్ వైద్యులు చేపట్టిన నిరసన తొమ్మిదో రోజుకు చేరింది. జీజీహెచ్ ఎదురుగా ఉన్న పీజీ వసతి గృహ ఆవరణలో నిరసన కొనసాగుతోంది. ఇందులో భాగంగా గురువారం రక్తదానం నిర్వహించారు. సాయంత్రం ఫ్లాష్ మార్చ్ చేపట్టారు. జీజీహెచ్ నుంచి ఇంద్రపాలెం అంబేడ్కర్ విగ్రహం వరకు సెల్ఫోన్లలో ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి నినాదాలు చేస్తూ సాగారు. ప్రభుత్వ మొండి వైఖరి వల్ల తమతో పాటు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జూడాలు ఆవేదన వ్యక్తం చేశారు. శిక్షణ భృతితోపాటు ఉద్యోగ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ఎండీ, ఎంఎస్ చేసిన వారికే అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.


