● ఇంటి ముట్టడిని అడ్డుకుంటాం
● స్పష్టం చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు
తుని రూరల్: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా బీసీలకు వెన్నెముకగా నిలుస్తున్నారని, అటువంటి నాయకుడి ఇంటిని ముట్టడిస్తామని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. తుని మండలం ఎస్.అన్నవరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జెడ్పీ వైస్ చైర్మన్ మెరుగు పద్మలత, ఎంపీపీ లగుడు శ్రీను, పెరిక కార్పొరేషన్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ పురుషోత్తం గంగాభవాని, నాయకులు రేలంగి రమణ గౌడ్, దుంగల నాగేశ్వరరావు, సత్యనారాయణ తదితరులు విలేకర్లతో మాట్లాడారు. తెలుగు జనతా పార్టీ నాయకుడి ఆధ్వర్యంలో బీసీలతో ఈ నెల 23న దాడిశెటి రాజా ఇంటిని ముట్టడిస్తామని పి.వెంకటేశ్వరరావు అనడం విడ్డూరంగా ఉందన్నారు. కాపునాడు ఉద్యమంలో టీడీపీ ప్రభుత్వం సంబంధం లేని బీసీలను అరెస్ట్ చేసినప్పుడు పెద్దన్నగా చెప్పుకుంటున్న వెంకటేశ్వరరావు కనీసం పరామర్శించారా అని ప్రశ్నించారు. తుని మున్సిపల్ చైర్ పర్సన్, పార్టీ పట్టణ అధ్యక్ష, కోటనందూరు ఎంపీపీ, రాష్ట్ర పెరికి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవులు ఇచ్చి బీసీలపై తనకు ఉన్న ఆప్యాయతను దాడిశెట్టి రాజా చాటుకున్నార న్నారు. అటువంటి నాయకుడిపై బీసీ వ్యతిరేకని ముద్రవేయడం వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీలో కీలక పదవులన్నీ బీసీలకు, ఎస్టీల కు ఇచ్చారన్నారు. ఏదైనా సమస్య ఉంటే చర్చల ద్వా రా పరిష్కరించుకుందామన్నారు. అంతేగానీ ముట్టడిస్తాం, బీసీ వ్యతిరేకి అంటూ చేసే ప్రయత్నాలను బీసీలుగా తామంతా అడ్డుకుంటామన్నారు. నియోజకర్గంలో 1.20 లక్షల మంది బీసీలు ఉన్నారని, వారంతా దాడిశెట్టి రాజా వెంటే నడుస్తారన్నారు.


