బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో జూలై 31న ప్రచురించిన డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై ప్రజలకు అవగాహన కల్పించి, అత్యంత కచ్చితత్వంతో కూడిన ఓటర్ల జాబితాను రూపకల్పన చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని డీఆర్వో డి.తిప్పే నాయక్ కోరారు. ఆయన మంగళవారం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పురోగతిని వివరించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా గత జూలై 31న డ్రాఫ్ట్ ఓటరు జాబితాను ప్రచురించామన్నారు. అప్పటి నుంచి ఆగస్టు 30 వరకు డ్రాఫ్ట్ జాబితాపై అభ్యంతరాలు స్వీకరించడం జరుగుతుందన్నారు. జిల్లాలో వివిధ కారణాలతో 1,95,602 ఓట్లను తొలగించడం జరిగిందని, వాటిలో 31,695 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశామన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజలకు అవగాహన, క్లెయిమ్స్, అభ్యంతరాల నమోదుకు సహకరించాలని సూచించారు.


