కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో వచ్చే నెల 15న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైధ్ అహ్మద్ మౌలానా మంగళవారం తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి శ్రీలక్ష్మి యార్లగడ్డ ఆధ్వర్యాన జాతీయ లోక్ అదాలత్, అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ సమావేశాలను మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్లో పరిష్కరించేందుకు వీలున్న పెండింగ్ సివిల్ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసుల వివరాలను న్యాయమూ ర్తులు అడిగి తెలుసుకున్నారు.
ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరిష్కారానికి అనుకూలమైన కేసుల వివరాలను డీఎల్ఎస్ఏకి అందజేయాలని సూచించారు. అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ సమావేశంలో విచారణలో ఉన్న ఖైదీల కేసుల దర్యాప్తు, చార్జిషీట్ల దాఖలు అంశాలపై పోలీసు అధికారులకు సూచనలు చేశారు. బెయిల్, జామీను పొందడంలో ఖైదీలు ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సిఫారసు చేశారు. కార్యక్రమంలో ఎస్పీ, ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులు, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్, కార్మిక శాఖలు, సెంట్రల్ జైలు, ప్రత్యేక జైలు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులు పాల్గొన్నారు.
మరింత కట్టుదిట్టంగా
నైట్ పెట్రోలింగ్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా నైట్ పెట్రోలింగ్ను మరింత పటిష్టం చేసి, నేరాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజలకు రాత్రి వేళల్లో పూర్తి భద్రత కల్పించేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా పని చేస్తోందని ఎస్పీ డి.నరసింహ కిశోర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రి గస్తీ సమయంలో నేరాలకు అవకాశమున్న ప్రాంతాలు, ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాలు, మార్కెట్లు, లాడ్జిలు, నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని వివరించారు.
తాళాలు వేసి ఉన్న ఇళ్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు. అనుమానాస్పద వ్యక్తులను పాత నేరస్తుల కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. సున్నిత ప్రాంతాలు, నేరాలకు అవకాశమున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ పెట్రోలింగ్ మరింత పెంచామని తెలిపారు. ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అత్యవసర సహాయానికి 112, సైబర్ మోసాల ఫిర్యాదులకు 1930, మహిళల సహాయానికి 181, బాలల సహాయానికి 1098 డ్రగ్స్పై 1933 నంబర్లను సంప్రదించాలని ఎస్పీ సూచించారు.


