అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వివాహాలు చేసుకునేందుకు గాను వివిధ రకాల గుమ్మటా లు (మండపాలు) వేసే లైసెన్సుకు గాను సోమవారం నిర్వహించిన టెండర్ కం బహిరంగ వేలంలో రెండేళ్ల కాలపరిమితికి నెలకు రూ.15.05 లక్షలకు హెచ్చు టెండర్ దాఖలైంది. గతంలో ఈ వివాహ మండపాల లైసెన్స్ నెలకు రూ.6.60 లక్షలు మాత్రమే. ఈ ఏడాది రూ.15.05 లక్షలకు ఖరారవడంతో నెలకు దాదాపుగా రూ.8.45 లక్షలు పెరిగింది. అంటే ఏడాదికి సుమారు రూ.కోటి ఆదాయం అదనంగా పెరిగిందని అధికారులు తెలిపారు. ఇది ఒక ఏడాదికి మాత్రమే. రెండో ఏడాది దీనిపై పది శాతం అధికం చెల్లించాలి. దీనికి జీఎస్టీ అధికం. ఈఓ నల్లం సూర్యచక్రధరరావు సమక్షంలో ఈ వేలం నిర్వహించారు. ఇతర షాపుల వేలం పరిశీలిస్తే.. కొబ్బరి కాయలు, అరటిపళ్లు, పూజా ద్రవ్యాల షాపునకు రెండేళ్లకు గాను నెలకు రూ.4.03 లక్షలకు వేలం ఖరారైంది. షాపు నెం.3లో కొబ్బరికాయలు, అరటిపళ్లు, పూజాద్రవ్యాలు విక్రయించేందుకు రెండేళ్ల కాలపరిమితికి నెలకు రూ.4.03 లక్షలకు ఖరారైంది. సత్యగిరిపై క్యాంటీన్ నిర్వహణ టెండర్ నెలకు రూ.7.90 లక్షలకు ఖరారవగా.. గతం కంటే ఇది రూ.1.03 లక్షలు అధికం. నాలుగో నంబర్ షాపునకు నెలకు రూ.45,999కు వేలం ఖరారైంది. ఐదో నంబర్ షాపునకు రూ. 27,999తో సింగిల్ టెండర్, వివాహ మండపాలకు గతం కంటే అతి తక్కువగా రూ.3 లక్షలకు సింగిల్ టెండర్ వేయడంతో వాటిపై నిర్ణయం వాయిదా వేశారు.


