అమలాపురం టౌన్: మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కారణంగా ఆటో డ్రైవర్లు ఆదాయం కోల్పోయారని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర ఆటో యూనియన్ నాయకుడు వంగనూరు జాన్సన్బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురంలోని దుర్గా ఆంజనేయ ఆటో యూనియన్ కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా ఆటో యూనియన్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జరిమానాల పేరుతో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న ఆర్టీఓ, పోలీసు ఆగడాలను అరికట్టాలని సమావేశం డిమాండ్ చేసింది. ఈ సమస్యపై జాన్సన్బాబుతో జిల్లా ఆటో యూనియన్ కార్మికులు చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ఆటో అండ్ ట్రాన్స్పోర్టు వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర మహాసభలు విశాఖపట్నంలో ఆగస్టు 20, 21 తేదీల్లో జరుగుతాయని జాన్సన్బాబు తెలిపారు. ఆటో కార్మికుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ ప్రధాన చర్చకు జరగనుందని తెలిపారు. అనంతరం రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు.


