అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధి నూతన జంటలతో జ్యేష్ట మాసంలో కళకళలాడింది. నెల రోజుల సాగిన ఈ సందడికి 10వ తేదీతో తెరపడింది. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఆషాఢ మాసం శుభకార్యాలకు మంచిది కాదనే అభిప్రాయంతో నెలంతా వివాహాలు జరగవు. తిరిగి నెల రోజుల తర్వాత శ్రావణ మాసంలో ఆగస్టు 15వ తేదీ నుంచి సెప్టెంబర్ ఆరో తేదీ వరకు వివాహాలు జరుగనున్నాయి. అధిక జ్యేష్ట మాసం సందర్భంగా గత నెల 15వ తేదీ నుంచి సుమారు నెల రోజుల పాటు రత్నగిరిపై వివిధ ముహూర్తాల్లో సుమారు 600 వివాహాలు జరిగాయి. వీటితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న నవ దంపతులు, వారి బంధుమిత్రులు సత్యదేవుని సన్నిధికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.


