బాలాజీచెరువు (కాకినాడ సిటీ): వాహనాల డ్రైవింగ్లో అప్రమత్తంగా ఉండాలని జిల్లా రవాణా అధికారి కె.శ్రీధర్ అన్నారు. తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదన్నారు. బడి బస్సు డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. వాహనాలపై ఈ నెలలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని, అక్రమ గ్రావెల్ రవాణా వంటి వాటిపై విస్తృత తనిఖీలు చేపట్టామని చెప్పారు. జిల్లా రవాణా శాఖ వార్షిక ఆదాయ లక్ష్యం రూ.13.40 కోట్లు కాగా, ఇప్పటి వరకూ 9 వేల కేసులు నమోదు చేసి, రూ.3 కోట్ల వరకూ జరిమానా విధించామని వివరించారు. రహావీర్(గుడ్ సమరిటన్ చట్టం–2016)పై అవగాహన పెంచుకోవాలన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రుల్లో చేర్పిస్తే చట్టంలోని నిబంధనల ప్రకారం రూ.1.50 లక్షల వరకూ ఉచిత వైద్యం చేస్తారని చెప్పారు. సహాయం చేసిన వ్యక్తికి రహావీర్ కింద రూ.25 వేల ప్రోత్సాహకం అందజేస్తారని తెలిపారు. గోల్డెన్ అవర్లో చేర్చితే రవాణా శాఖ ద్వారా గ్యాలెంరట్రీ అవార్డు, నగదు బహుమతి ఇస్తారని చెప్పారు. వీరికి ఏవిధమైన పోలీసు కేసులు, కోర్టు సాక్ష్యాల వంటి భయం ఉండదని శ్రీధర్ స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్టీఓ మురళీకృష్ణ, ఏఎంవీఐ నాగేంద్ర పాల్గొన్నారు.


