పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇలాకాలో క్లోజర్ పనులు ఇవి. ఇందులో అవినీతి కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. వరదల నుంచి రక్షణ కల్పించాల్సిన కాలువ గట్లను రూ.లక్షల నిధులు దిగమింగి కేవలం మట్టితో కప్పి ఇసుక బస్తాలతో అందంగా పేర్చి నీటిపారుదల శాఖ అధికారులు, జనసేన నేతలు ఇలా చేశారు. క్లోజర్ పనుల్లో భాగంగా పిఠాపురం మండలం రాపర్తి సమీపంలో ఏలేరు కాలువ గొర్రిఖండి వద్ద గట్టును అభివృద్ధి చేశారు. శుక్రవారం కురిసిన చిన్నపాటి వర్షానికే అండలు జారి జనసేన నేతల అవినీతిని బయటపెట్టింది. ఏలేరు నుంచి అదనపు జలాలు వదిలినా, భారీ వర్షాలు కురిసినా ఇక ఏమవుతుందో చూడాలి. వేలాది క్యూసెక్కుల నీటి ప్రవాహం ఇక్కడకు చేరుకుంటుంది. ఇక్కడ గట్టుకు గండి పడితే సుమారు 12 వేల ఎకరాలు నీటపాలవుతుంది. గత కొన్నేళ్లుగా వరదలు రావడం, పంటలు నష్ట పోవడం పరిపాటిగా మారింది. అలాంటి ప్రాధాన్యం ఉన్న గట్టుకు చేసిన మరమ్మతులు చినుకులకే గట్టు అండలు జారితే, పెద్ద వర్షం వస్తే అసలు గట్టే కనిపించదంటున్నారు రైతులు. ఏలేరు ఆయకట్టు పరిధిలో కాలువ మరమ్మతు పనుల్లో అవినీతి చోటు చేసుకుంటుందని, నాణ్యత మచ్చుకై నా కనిపించడం లేదని ఈ నెల 2న అవి‘నీటి’ జలగలు అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో కథనం వెలువడిన విషయం తెలిసిందే. ఇలాంటి పనులతో తమ పంటలకు రక్షణ ఎక్కడ ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


