● స్మరించుకున్న ప్రముఖులు
● ఘనంగా జయంత్యుత్సవం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి, వాటిని రక్తి కట్టించిన ఎస్వీ రంగారావు (ఎస్వీఆర్) దేశం గర్వించదగిన నటుడు అని వక్తలు కొనియాడారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టు, చిరంజీవి ఫ్యాన్స్, ఎస్వీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న ఎస్వీఆర్ విగ్రహం వద్ద శుక్రవారం ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ చల్లా శంకరరావు, ప్రముఖ కాంట్రాక్టర్ ఆర్ సుబ్బరాజు, కాంగ్రెస్ నేతలు టీకే విశ్వేశ్వరరెడ్డి, రామినీడి మురళీ, టీడీపీ నేత యర్రా వేణుగోపాలరాయుడు, జనసేన సిటీ ఇన్చార్జి వై.శ్రీనివాస్, ఎస్వీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్వీఆర్ జయంతిని ఏటా నిర్వహిస్తున్న పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ పంతం కొండలరావు, చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు కొత్తపేట రాజాను వక్తలు అభినందించారు. వచ్చే ఏడాది నుంచి ఎస్వీఆర్ జయంతిని కొత్తపేట రాజా, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టు సభ్యుడు యెనుముల రంగబాబు, కాపునాడు జిల్లా అధ్యక్షుడు గుదే రఘునరేష్, లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ అధ్యక్షుడు నామన వాసు ఆధ్వర్యంలో జరుగుతాయని ప్రకటించారు. ఈ సందర్భంగా పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు.


