అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి ఆదివారం రద్దీగా మారింది. వివాహ ముహూర్తాలుండటంతో వ్రతాలు, సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. సుమారు 40 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. రెండు వేల వ్రతాలు జరిగాయి. వివిధ విభాగాల ద్వారా రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. సుమారు ఆరు వేల మంది భక్తులు సత్యదేవుని అన్న ప్రసాదం స్వీకరించారు. ఉదయం నుంచీ భారీ వర్షం కురవడంతో సత్యదేవుని సన్నిధికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలయ ప్రాంగణం చుట్టూ ఉన్న గ్రీన్ షేడ్ నుంచి వాన నీరు కారడంతో దాని కింద నుంచి వెళ్లిన వారు తడిసి ముద్దయ్యారు. వేసవిలో పలుచోట్ల నిర్మించిన చలువ పందిళ్ల నుంచి కూడా వర్షపు నీరు కారుతూండటం వలన కూడా భక్తులు ఇబ్బంది పడ్డారు. రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో భక్తుల కోసం అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారో వేచి చూడాలి.


