
వేడుకల వేళ విషాదం
తాళ్లరేవు: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దుస్తులు కొనుగోలు చేసేందుకు నాలుగేళ్ల కుమారుడితో కలిసి వెళ్లిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజులూరు మండలం శీల్లంక గ్రామానికి చెందిన జల్లి బాలకృష్ణ (33) అలియాస్ బాలాజీ కోరంగి పోలీస్ స్టేషన్ సమీపంలో నూడుల్స్ వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జెండా పండగ కోసం తన కుమారుడు చాణక్యకు కొత్త దుస్తులు కొనేందుకు గురువారం ఆ బాలుడిని తీసుకుని యానాం బయలుదేరాడు. వారిని యానాం బైపాస్లో మంగళ ఎంటర్ప్రైజెస్ వద్ద మినీ వ్యాన్ వేగంగా ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బాలాజీ అక్కడికక్కడే మృతి చెందగా, చాణక్యకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన బాలుడిని యానాం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ప్రమాదాన్ని పసిగట్టిన బాలాజీ తన కుమారుడిని గుండెలకు హత్తుకుని పట్టుకోవడంతో ఆ బాలుడు ప్రమాదం నుంచి బయటపడినట్లు స్థానికులు చెబుతున్నారు. బాలాజీ మృతదేహం వద్ద అతడి సోదరుడు ప్రకాష్ బోరున రోదించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఆమె ప్రస్తుతం గర్భిణి. కాగా.. పోలీసులు సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించి ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతిసే ర్యాగింగ్
రాజానగరం: విద్యార్థి దశలో జూనియర్లను ర్యాగింగ్ చేయడం ఆనందమని సీనియర్లు భావిస్తారని.. కానీ అది ఆ విద్యార్థి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న యాంటీ ర్యాగింగ్ వీక్ కార్యక్రమంలో భాగంగా గురువారం జరిగిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తన జీవితంలో కూడా ర్యాగింగ్కు భయపడిన సంఘటనలు ఉన్నాయంటూ గుర్తు చేసుకున్నారు. ఎవరూ ర్యాగింగ్కు పాల్పడవద్దని, పాల్పడితే చట్టాల నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. ప్రతి తల్లి, తండ్రి తమ పిల్లలను ర్యాగింగ్కు దూరంగా ఉంచాలని చూస్తారని, అందుకోసమే ర్యాగింగ్ ఛాయలు లేని కళాశాలలు, యూనివర్సిటీలను ఎంపిక చేసుకుంటున్నారన్నారు. ర్యాగింగ్ వలన జీవితాలు నాశనం అవడమే కాకుండా కన్నవారికి, చదువుకునే సంస్థలకు కూడా చెడ్డ పేరు వస్తుందన్నారు. వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ మాట్లాడుతూ ‘నన్నయ’ వర్సిటీ అంటేనే సత్ప్రవర్తనకు కేరాఫ్ అనే ఖ్యాతిని పొందేలా మీ నడవడిక ఉండాలని విద్యార్థులకు హితవు పలికారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, అధ్యాపకులు పాల్గొన్నారు.
● కొత్త దుస్తులు కొనుగోలు చేసేందుకు వెళుతుండగా ప్రమాదం
● తండ్రి మృతి, కుమారుడికి గాయాలు

వేడుకల వేళ విషాదం