
సీతారాముల ఉత్సవ విగ్రహాల చోరీ
కొత్తపల్లి: మండలంలోని ఉప్పాడ నాయకర్ కాలనీ–1లో ఉన్న సీతారామస్వామి ఆలయంలోని ఉత్సవ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. స్థానిక ఆలయంలో పూజలు చేసే మల్లే మంగ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆలయ పునర్నిర్మాణం అనంతరం గత సంవత్సరం ఏప్రిల్ 15న విగ్రహాలను ప్రతిష్ఠించారు. స్థానిక భక్తులు రోజూ ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తుంటారు. 4రోజుల క్రితం స్థానిక వ్యక్తి పూజలు చేస్తానని తాళాలు తీసుకున్నాడు. పూజ అనంతరం ఆలయానికి వేసిన తాళాన్ని దగ్గరలో ఉన్న కిళ్లీ కొట్టులో ఇచ్చి వెళ్లాడు. ఆ కాలనీలో ఏ సమస్య వచ్చినా గ్రామ పెద్దలు ఆలయం వద్దే చర్చిస్తారు. ఈ తరహాలో శుక్రవారం ఉదయం స్థానిక సమస్యపై పెద్దలు చర్చించుకుంటున్నారు. దీంతో ఆలయంలోని ఉన్న ఉత్సవ విగ్రహాలైన సీతారాములు, లక్ష్మణ విగ్రహాలు కనిపించకపోవడంతో చోరీకి గురైనట్టు గుర్తించారు. ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న మంగ తాళం తీసి చూడగా ఆంజనేయ విగ్రహం మినహా మిగిలిన మూడు విగ్రహాలను అపహరించినట్లు గుర్తించారు. చోరీకి గురైన సీతారామ లక్ష్మణుల విగ్రహాలు సుమారు 50 కేజీల కంచుతో తయారు చేయించి గంపల రమణ కుటుంబ సభ్యులు అందించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని విగ్రహాలను ఇచ్చిన దాతలకు తెలియపరిచామన్నారు. దీనిపై గ్రామస్తుడు ఉమ్మిడి జగన్నాథం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కొత్తపల్లి ఎస్ఐ జి.వెంకటేష్ తెలిపారు.