కృష్ణా.. తోడేస్తుండ్రు | - | Sakshi
Sakshi News home page

కృష్ణా.. తోడేస్తుండ్రు

Sep 21 2026 1:08 AM | Updated on Sep 21 2026 1:08 AM

10 టీఎంసీలు వాడుకున్నాం..

విచ్చలవిడిగా వాడకం..

అచ్చంపేట: ఇటు తెలంగాణ, అటు ఏపీ రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు, కోట్లాది మందికి తాగునీటిని అందించడంతో నిరంతర విద్యుత్‌ సరఫరాకు దోహదపడే శ్రీశైలం జలాశయంలో డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నాయి. ఈ ఏడాది ఎల్‌నివో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడమే ఇందుకు కారణం. ఎగువ నుంచి ఆశించిన స్థాయిలో వరద ప్రవాహం లేకపోవడంతోపాటు.. వచ్చిన కొద్దిపాటి నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు విచ్చలవిడిగా తోడేస్తుండటంతో నీటి నిల్వలు డెడ్‌ స్టోరేజ్‌ దశకు చేరుకుంటున్నాయి. గతేడాది నిండా నీటితో కళకళలాడిన జలాశయం.. నీటిమట్టం వేగంగా క్షీణించి 861.10 అడుగులకు చేరింది. ఈసారి ఎగువనున్న ఆల్మటి, నారాయణపూర్‌, జూరాల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం లేకపోవడంతో శ్రీశైలంలో ఎండీడీఎల్‌ 834 అడుగుల చేరువలోకి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో తాగునీటికే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

తాగు, సాగునీటికి కష్టాలే..

ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుత వానాకాలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఈ ఏడాది సాగునీటికి కష్టాలు తప్పేలా లేవు. శ్రీశైలం జలాశయం గరిష్ట నిల్వ మట్టం 885 అడుగులు కాగా.. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు. అయితే గురువారం నాటికి 861.1 అడుగుల వద్ద 109.5400 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇందులో 834 అడుగులు, 30 టీఎంసీలు డెడ్‌ స్టోరేజ్‌ కాగా వినియోగానికి వీలుండేది కేవలం 27.1 అడుగులు, 79.5400 టీఎంసీలు మాత్రమే. నాగర్‌కర్నూల్‌, వనపర్తి, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలకు కృష్ణా జలాలనే కేఎల్‌ఐ పంపుల ద్వారా ఎత్తిపోసి తాగునీటి కోసం మిషన్‌ భగీరథ పథకానికి తరలిస్తారు. ఏడాదికి సుమారు 10– 12 టీఎంసీలు అవసరం అవుతాయి. వరదల సమయంలో ఏటా 35 నుంచి 45 టీఎంసీల నీటిని కేఎల్‌ఐ పంపుల ద్వారా ఎత్తిపోసేవారు. ఇందులో దాదాపు సాగునీటికి 35 టీఎంసీల వరకు వినియోగించేవారు. ఈసారి కేఎల్‌ఐ పంపుహౌస్‌ల్లో ఐదు మోటార్లకు గాను మూడింటితోనే ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్లకు తాగు, సాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకున్నారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ నుంచి కేఎల్‌ఐ ద్వారా నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్‌, వనపర్తి, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాలతోపాటు ఇతర ప్రాంతాల్లో 3.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంటుంది. ఈ ఏడాది వ ర్షాకాలంలో నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో రైతులు వరిపంట సాగు చేశారు. శ్రీశైలంలో ఆశించిన స్థాయిలో నీరు లేకపోవడంతో పంటలకు సాగునీరు అందడం ప్రశ్నార్థకంగా మారింది.

శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం ఇలా..

శ్రీశైలానికి వరదలు వచ్చిన సమయంలో ఈ ఏడాది ఇప్పటి వరకు తాగు, సాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. మూడు మోటార్ల ద్వారా రోజుకు 800 నుంచి 2,400 క్యూసెక్కుల నీటిని ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్లకు తరలించాం. రిజర్వాయర్లతోపాటు డిస్ట్రిబ్యూటరీ కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తున్నాం.

– అమర్‌సింగ్‌, ఈఈ, సాగునీటి పారుదలశాఖ

కృష్ణానది పరివాహకంలో కురిసిన వర్షాలతో మహారాష్ట్రలోని ఉజ్జయిని, కర్ణాటకలోని ఆల్మ టి, నారాయణపూర్‌ జలాశయాలు నిండిన తర్వాత విడుదల చేసిన నీళ్లు గత జూలై చివరి నాటికి జూరాల మీదుగా శ్రీశైలానికి చేరుకున్నాయి. దీంతో వానాకాలం ప్రారంభానికి ముందు శ్రీశైలంలో 39 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ఆగస్టు 12 నాటికి ఎగువ నుంచి 185.5 టీఎంసీల నీరు వచ్చింది. దీంతో శ్రీశైలంలో 215.11 టీఎంసీల నీరు చేరగా.. తెలంగాణ కేఎల్‌ఐ, ఏపీ పోతిరెడ్డిపాడు, మల్యాల నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌), వెలుగోడు, ముచ్చుమర్రి పథకాలకు వాడుకుంటోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు శ్రీశైలం నుంచి ఇప్పటి వరకు 145 టీఎంసీల నీటిని వాడుకున్నట్లు శ్రీశైలం గేజింగ్‌ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు రెండు రాష్ట్రాలు పోటాపోటీగా విద్యుదుత్పత్తి ద్వారా పెద్దఎత్తున నీటిని దిగువనున్న నాగార్జునసాగర్‌కు విడుదల చేశాయి. తెలంగాణ శ్రీశై లం ఎడమ గట్టు జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా తెలంగాణ జెన్‌కో 446.13 మి.యూ., ఏపీ 72.62 మి.యూ., విద్యుదుత్పత్తి చేసింది. ప్రస్తుతానికి వచ్చిన వరదలతో కాస్త ఉపశమనం పొందినా భవిష్యత్‌ పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

శ్రీశైలంలో అతి తక్కువ నీటిమట్టం

ప్రస్తుతం జలాశయంలో 861.10

అడుగుల వద్ద 109.5400 టీఎంసీలు

డేంజర్‌ బెల్స్‌.. ఎండీడీఎల్‌కు

కేవలం 79.5400 టీఎంసీలే

ఇలాగే కొనసాగితే సాగు,

తాగునీటిపై తీవ్ర ప్రభావం

వచ్చే జూన్‌ వరకు తాగునీటికే ప్రాధాన్యం అంటున్న ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement