గద్వాలన్యూటౌన్/అలంపూర్: రాష్ట్రంలోని ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హల్లో నిర్వహించిన పీఆర్టీయూ టీఎస్ జిల్లాశాఖ సర్వసభ్య సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో పాటు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పెండింగ్లో ఉన్న పీఆర్సీని మంచి ఫిట్మెంట్ అమలు చేయించడంతో పాటు పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను ఇప్పించే బాధ్యత తనదేనని చెప్పారు. సీఎంతో జరగనున్న సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చలు సఫలీకృతం కాకపోతే.. పీఆర్టీయూ టీఎస్ పక్షాన ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం అలంపూర్ ఆలయాలను ఎమ్మెల్సీ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలను అందజేసి అశీర్వచనం పలికారు.
● ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ, పేద విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. ఉపాధ్యాయులపై ఉన్న విద్యా బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని తెలిపారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు పచ్చర్ల తిమ్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు రాజీవ్రెడ్డి, పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రెడ్డి, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు బుచ్చారెడ్డి, పరమేశ్వర్రెడ్డి, నర్సింహారెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి ఉన్నారు.


