పాలమూరు యూనివర్సిటీలో అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆరుగురు ప్రొఫెసర్లు పిండి పవన్కుమార్, కిషోర్కుమార్, నూర్జహాన్, జైపాల్రెడ్డి, మధుసూదన్రెడ్డి, చంద్రకిరణ్కు అనుభవం ఉంది. వీరిలో ప్రొఫెసర్ చంద్రకిరణ్కు తప్ప.. మిగతా ఐదుగురు సీనియర్లకు ఏ రకమైన కీలక బాధ్యతలు ఇవ్వకుండా మొండిచేయి చూపడం చర్చనీయాంశంగా మారింది. గతంలో రిజిస్ట్రార్గా సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రొఫెసర్ మధుసూదన్రెడ్డికి పీజీ కళాశాల ప్రిన్సిపాల్తో పాటు వీసీ ఓఎస్డీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఒక్కరికి 2, 3 బాధ్యతలు..
యూనివర్సిటీ పరిధిలోని ఎనిమిది ప్రిన్సిపాల్ పోస్టుల్లో ఏకంగా ఐదింటిని కాంట్రాక్ట్ అధ్యాపకులతో భర్తీ చేయడం.. ఒక్కరికి రెండు, మూడు పోస్టుల చొప్పున ఇవ్వడం.. ప్రొఫెసర్ హోదాలో ఉన్న సీనియర్లను కీలక బాధ్యతల నుంచి తప్పించడం, నామమాత్రపు పోస్టుల్లో నియమించడం విమర్శలకు తావిస్తోంది. రెగ్యులర్ పోస్టుల్లో పనిచేస్తున్న వారిని కాదని.. కాంట్రాక్ట్ అధ్యాపకులకు ప్రాధాన్యమివ్వడంపై విద్యార్థుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


