గద్వాల: కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సర్ ప్రక్రియలో భాగంగా అన్మ్యాపింగ్, అనామలీస్ జాబితాలో ఉన్న వారందరికీ నోటీసులు జారీ చేయాలన్నారు. హియరింగ్కు రాని వారి ఇంటికి బీఎల్ఓలు స్వయంగా వెళ్లి అవసరమైన డాక్యుమెంట్స్ సేకరించాలని సూచించారు. అదే విధంగా చేయూత పింఛన్కు దరఖాస్తు చేసుకునే భవిత కేంద్రాల్లోని వికలాంగులైన పిల్లలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇతర వర్గాల వారు కూడ పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నందున అర్హులైన వారిని పారదర్శకంగా ఎంపిక చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఆయా మండలాల వారీగా దరఖాస్తుదారుల వివరాలను నోటీసు బోర్డులో ప్రకటించాలని తెలిపారు. వీటిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, అర్హులైన వారికి మంజూరు చేయాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి గ్రామ పంచాయతీల్లో చేసిన పనుల బిల్లులను పరిశీలించి, జిల్లా పంచాయతీ కార్యాలయానికి పంపించాలన్నారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా పంట పొలాల్లో నీటికుంటలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, బోర్వెల్స్ రీచార్జ్ పనులను చేపట్టాలన్నారు. ఈ నెల 17న అన్ని కార్యాలయాల్లో ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని తెలిపారు. వినాయక నిమజ్జన కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.
● ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పౌష్టికాహారం ఎంతో ముఖ్యమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఐడీవోసీ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. శిశువులకు ఆరునెలల వరకు తల్లిపాల ఆవశ్యకత, అంగన్వాడీ చిన్నారులు బాలమృతం సద్వినియోగం చేసుకోవడంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 22 నుంచి ఉన్నత, రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లోని సుమారు 40వేల మంది విద్యార్థులకు హెల్త్కార్డులు పంపిణీ చేయడంతో పాటు వివిధ రకాల పరీక్షలను నిర్వహించి, వివరాలను నమోదు చేయాలన్నారు. అనంతరం బలమైన బాల్యానికి వెయ్యి మెట్లు అనే గోడపత్రికను విడుదల చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, డీడబ్ల్యూఓ సునంద, డీఈఓ విజయలక్ష్మి, డీఆర్డీఓ ముసాయిదాబేగం, డీపీవో శ్రీకాంత్, బీసీ సంక్షేమశాఖ అధికారి అక్బర్పాషా పాల్గొన్నారు.


