ఉమ్మడి జిల్లాలో ఎన్హెచ్–44పై ప్రయాణం సాఫీగా సాగడం లేదు. కొన్నాళ్ల నుంచి హైవేపై అండర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు సాగుతుండటమే ఇందుకు కారణమవుతోంది. బ్రిడ్జి నిర్మాణం జరిగే చోట పనులను కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయడం లేదు. దీంతో పనులు నెలల తరబడిగా సాగుతుండటంతో ప్రతిరోజు ట్రాఫిక్ కష్టాలు వాహనదారులకు చిరాకు తెప్పిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో కొత్తూరు నుంచి అలంపూర్ వరకు ఎన్హెచ్–44 సుమారు 180 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అయితే జాతీయ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరిగే చోట బ్లాక్ స్పాట్లుగా గుర్తించి అక్కడ అండర్ బ్రిడ్జిల నిర్మించడానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని బాలానగర్, రాజాపూర్, భూత్పూర్ మండలం శేర్పల్లి, మూసాపేట మండలం పోల్కంపల్లి స్టేజీ, జానంపేట, వేముల స్టేజీ, వనపర్తి జిల్లా పరిధిలోని పెద్దమందడి మండలం వెల్టూర్ స్టేజీ, కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద అండర్ బ్రిడ్జిల పనులు చేపడుతున్నారు. ఇందులో బాలానగర్, రాజాపూర్, వేముల స్టేజీ వద్ద సుమారు ఏడాదిన్నర కిందట ప నులు మొదలయ్యాయి. కాగా.. హైవేపై పనులు జ రిగే చోట తీసుకోవాల్సిన కనీస రక్షణ చర్యలను కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు. రోడ్డు పనులు జరి గే చోట అవసరమైన ప్రాంతాల్లో నిబంధనలు పా టించడం లేదు. పనులు జరిగే ప్రదేశాల్లో సరైన ఏ ర్పాట్లు చేయకపోవడంతో సర్వీస్ రోడ్లు సక్రమంగా కనిపించడం లేదు. దీంతో వాహనాలు వరుస క్ర మంలో ఢీకొంటున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
బాలానగర్లో ఫ్లైఓవర్ నిర్మాణ పనుల వల్ల నిలిచిన వాహనాలు (ఫైల్)
దుమ్ముతో తంటాలు
బ్రిడ్జి పనులు మొదలైనప్పటి నుంచి విపరీతమైన దుమ్ము షాపులోకి వస్తుంది. దీంతో నిత్యం దుమ్మును క్లీన్ చేయడంతో పాటు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఇంకా ఎన్ని రోజులు మాకు ఈ సమస్యలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. – అనూష, బాలానగర్
ట్రాఫిక్లో చిక్కుకుంటున్నాం..
బాలానగర్లో ఫ్లైఓవర్ పనులు పూర్తి కాకపోవడంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నాం. వారంలో రెండుమూడు రోజులు మా సొంత గ్రామం ఎన్మన్గండ్లకు వచ్చి వెళ్తుంటాను. బాలానగర్ వచ్చిందంటే చాలు ట్రాఫిక్లో చిక్కుకొని సమయం అంతా వృథా అవుతోంది. అధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తిచేయాలి. – శేఖర్రెడ్డి, వాహనదారు
ఉమ్మడి జిల్లాలో ఎన్హెచ్–44పై అండర్ బ్రిడ్జి నిర్మాణాల్లో తీవ్ర జాప్యం
బాలానగర్, రాజాపూర్ వద్ద నిత్యం ట్రాఫిక్ కష్టాలు
వేముల స్టేజీ వద్ద నెలల తరబడిగా సాగుతున్న పనులు
హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు నరకప్రాయంగా ప్రయాణం
గంటల తరబడి ట్రాఫిక్లోచిక్కుకొని వాహనదారుల అవస్థలు
ఎక్కడెక్కడ ఎలా..
బాలానగర్, రాజాపూర్ వద్ద ప్రతిరోజు అరగంట, గంటపాటు వాహనాలు నిలిచిపోతున్నాయి. ఇక్కడ అండర్ బ్రిడ్జిల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.
మూసాపేట మండలం వేముల స్టేజీ వద్ద ఏడాదిన్నర కిందట పనులు మొదలైనా ఇప్పటికీ పూర్తి కాలేదు. దీనికితోడు ఇక్కడ సర్వీస్ రోడ్లను అరకొరగా చేపట్టడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక పోలీస్స్టేషన్ వైపు ఒక సర్వీస్ రోడ్డుపై కంకర వేసి వదిలేశారు. ఈ రోడ్డుపై వాహనాలు వెళ్తే దుమ్ముతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. అలాగే హనుమాన్ విగ్రహం వద్ద కూడా సర్వీస్ రోడ్డు అస్తవ్యస్తంగా మారింది.
పోల్కంపల్లి స్టేజీ, వెల్టూరు స్టేజీల వద్ద సర్వీస్ రోడ్ల పనులే చేయిస్తున్నారు. ఇక్కడ వాహనాలు ప్రధాన రోడ్డుపైనే వెళ్తున్నాయి. కనిమెట్ట వద్ద సర్వీస్ రోడ్లు పూర్తి కాగా అండర్ బ్రిడ్జి పనులు సాగుతున్నాయి. వాహనాలు సర్వీస్ రోడ్లపైనే వెళ్తున్నాయి. భూత్పూర్ మండలం శేర్పల్లి(బీ) వద్ద కర్నూ లు వైపు సర్వీస్ రోడ్డు పూర్తికాగా.. వాహనాలు దానిపైనే వెళ్తున్నాయి. హైదరాబాద్ వైపు వెళ్లే సర్వీస్ రోడ్డు పూర్తి కాలేదు. అండర్ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి.


