గద్వాల: గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సమగ్ర అభివృద్ధి ప్రణాళిక మేరకు జీపీ నిధులను వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం కింద జిల్లాలో ఇప్పటి వరకు 1,600 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా.. సుమారు 660మందికి పైగా రూ. 20వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేయడం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచామన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయని.. సకాలంలో పనులను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జీపీ భవనాల నిర్మాణాలకు అవసరమైన స్థలాలను గుర్తించాలని తెలిపారు. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణాలకు కూడా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. సమావేశంలో పీఆర్ డిప్యూటీ కమిషనర్ అనిల్కుమార్, అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, డీఆర్డీఓ ముసాయిదాబేగం, డీపీఓ శ్రీకాంత్, డీఎల్పీఓ ప్రవీణ్కమార్రెడ్డి ఉన్నారు.
ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను జిల్లాలో వేగవంతంచేసి.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని 30వ వార్డు రాతిబురుజులో బీఎల్వోలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బూత్స్థాయిలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, డేటా ఎంట్రీ పురోగతిని సమీక్షించారు. ఫారాలు పంపిణీ చేయడమే కాకుండా.. పూర్తిగా పూరించిన దరఖాస్తులను తిరిగి సేకరించడంపై ప్రత్యేక దృష్టిసారించాలని బీఎల్ఓలకు సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ హరికృష్ణ, డీటీ వరప్రసాద్, ఉదయ్కిరణ్, ఆర్ఐ వెంకటేశ్వర్రెడ్డి ఉన్నారు.


