గద్వాల: వికసిత్ భారత్ లక్ష్యంగా దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అహర్నిషలు కృషిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని డీకే బంగ్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రధానిగా నరేంద్రమోదీ ఆధ్వర్యంలో భారతదేశం గడిచిన పన్నెండేళ్లలో ఎంతో పురోగతి సాధించిందన్నారు. పన్నెండేళ్ల సేవా ప్రస్థానంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు వెల్లడించారు. 58.15 కోట్ల జనధన్ ఖాతాలు, 44 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులు, 15.7 కోట్ల కుటుంబాలకు నూతనంగా నల్లానీటి కనెక్షన్లు, 1.46 లక్షల కిలోమీటర్ల రోడ్లు, 12 కోట్ల మరుగుదొడ్లు, 10 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణం, 2.9 కోట్ల ఇళ్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు, కోట్లాది మందికి ఉచిత రేషన్ బియ్యం సరఫరా, జనధన్ ఖాతాలో రూ.3 లక్షల కోట్లకుపైగా డిపాజిట్లు, 9 కోట్లకు పైగా అటల్ పెన్షన్ యోజన సభ్యులు, 58 కోట్లకు పైగా బీమా పథకాల లబ్ధిదారులు వంటి అనేక సంక్షేమాభివృద్ధి పథకాలు అందించినట్లు చెప్పారు. అంతేకాకుండా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్, నక్సల్స్ విముక్తి, కోవిడ్ సమయంలో ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ వంటివి ప్రజలకు, దేశానికి రక్షణ కల్పించే చర్యలు చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో నాయకులు రామాంజనేయులు, డీకే స్నిగ్ధారెడ్డి, బండల వెంకట్రాములు, రమాదేవి, రవికుమార్, దాస్, శాలన్న తదితరులు పాల్గొన్నారు.


