మానవపాడు: రైతుల పంటలు నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని ఏటీఎంఏ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ జగ్గు నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూసార పరీక్షకు 3 సూత్రలు పాటించాలని సూచించారు. సమతుల్యత ఎరువుల వినియోగం నేల పరీక్షల ఆధారంగానే ఎరువులు వేయాలన్నారు. పచ్చిరొట్ట ఎరువులు పెంచాలని, రసాయనికి ఎరువులు, పురుగు మందులు విచక్షణా రహితంగా వాడొద్దని, అధిక వాడకం వల్ల నేల చనిపోయి దిగుబడి నాణ్యత తగ్గిపోతుందన్నారు. నానో ఎరువులు వాడితే తక్కువ మోతాదులో ఎక్కువ ఫలితం వచ్చి.. నేల పర్యావరణ కాలుష్యం తగ్గుతుందన్నారు. ఎరువుల హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ రవాణా అరికట్టేందుకు పంచాయతీ, మండల, జిల్లా స్థాయిల్లో ‘ఫర్టిలైజర్ నిఘా సమితులు’ ఏర్పాటు చేసినట్లు వివరించారు. గ్రామ కమిటీలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఏఈఓ, పీఏసీఎస్ సిబ్బంది సభ్యులుగా ఉంటారని వివరించారు. దీంతో రైతులకు ఎరువులు సకాలంలో సరైన ధరకు అందుతాయన్నారు. కార్యక్రమంలో బీటీఎం శ్రీధర్రెడ్డి, ఏఓ ప్రదీప్కుమార్, ఇన్పుట్ డీలర్లు, రైతులు పాల్గొన్నారు.


