నాగర్కర్నూల్ క్రైం: క్రషర్ మెషిన్ మూసివేశారని మనస్తాపానికి గురైన నాగర్కర్నూల్ పీఏసీఎస్ మాజీ చైర్మన్ బండారు శ్రీనివాస్రెడ్డి (60) బుధవారం తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ గోవర్ధన్ వివరాల మేరకు.. నాగర్కర్నూల్ మండలం వనపట్లకు చెందిన శ్రీనివాస్రెడ్డి గ్రామ శివారులో క్రషర్ మెషిన్ ఏర్పాటు చేసుకున్నారు. మూడు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన కొందరు క్రషర్ మెషిన్పై ఫిర్యాదు చేయడంతో అధికారులు మూసివేశారు. నాటి నుంచి క్రషర్ కార్యకలాపాలతో పాటు లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్రెడ్డి.. క్రషర్ మెషిన్ వద్ద ఉన్న తన నివాసంలో ఉరివేసుకున్నారు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని కొల్లాపూర్ చౌరస్తాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనకు సంబంధించి మృతుడి భార్య చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. శ్రీనివాస్రెడ్డి మృతి విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి జిల్లా ఆస్పత్రికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.


