జోగుళాంబ గద్వాల
● ఇటీవలే అటవీ శాఖ నుంచి క్లియరెన్స్
● టెండర్లు ఓపెన్ చేయడమే తరువాయి
● ఆలోగా వంతెనకు అప్రోచ్ రోడ్లు నిర్మించేలా చర్యలు
● కొల్లాపూర్ నుంచి మల్లేశ్వరం వరకు భూ సేకరణ వేగవంతం
బుధవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2026
కొల్లాపూర్: నాగర్కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారి–167కే పనులకు అన్ని రకాల అడ్డంకులు తొలగుతున్నాయి. కొన్నిచోట్ల ఈ రహదారి నల్లమల అటవీ ప్రాంతం గుండా వెళ్తుండగా.. మల్లేశ్వరం– సంగమేశ్వరం మధ్యలో కృష్ణానదిపై ఐకానిక్ సస్పెన్సివ్ కేబుల్ బ్రిడ్జి నిర్మించే ప్రాంతం సైతం నల్లమల అటవీ భూ భాగంలోనే ఉంది. ఇన్నాళ్లు అటవీ క్లియరెన్స్ లేకపోవడంతో ఈ పనులు చేపట్టడంలో జాప్యం జరుగుతుండగా.. ఇటీవలే జాతీయ అటవీ శాఖ నుంచి రహదారి, కేబుల్ బ్రిడ్జి నిర్మాణాలకు అనుమతులు లభించాయి. దీంతో నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు నేషనల్ హైవే అథారిటీ అధికారులు చర్యలు ప్రారంభించారు.
టెండర్ల ఓపెన్పైనే ఉత్కంఠ
రూ.963 కోట్ల వ్యయంతో కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి టెండర్ల కాలపరిమితిని రెండున్నరేళ్లుగా అధికారులు పొడిగిస్తూ వస్తున్నారు. అటవీ శాఖ నుంచి క్లియరెన్స్ కోసమే ఇన్నాళ్లు ఆగుతూ వచ్చారు. 2023 అక్టోబర్లో బ్రిడ్జి టెండర్లను ఆహ్వానించగా.. పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు టెండర్ దాఖలు చేశాయి. కానీ, ఇప్పటి వరకు టెండర్లు ఓపెన్ చేయలేదు. ఈ నెల 16 వరకు టెండర్లకు చివరి గడువుగా ఎన్హెచ్ అధికారులు తమ వెబ్సైట్లో పొందుపర్చారు. అటవీ శాఖ క్లియరెన్స్ వచ్చినందున త్వరలోనే టెండర్లు ఓపెన్ చేస్తారని అఽధికారులు చెబుతున్నారు.
●
కృష్ణానదిపై తీగల వంతెన నిర్మాణానికి తొలగిన అడ్డంకులు


