అలంపూర్: ప్రకృతి సేద్యంతో సుస్థిర దిగుబడులు సాధించవచ్చని ఏడీఏ సక్రియా నాయక్ అన్నారు. అలంపూర్ మండలం బుక్కాపురం రైతువేదికలో మంగళవారం ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ.. రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి, ప్రకృతి వ్యవసాయంపై దృష్టిసారించాలని సూచించారు. ప్రకృతి సేద్యం రైతులకు లాభసాటిగా ఉంటుందన్నారు. అదే విధంగా పర్యావరణానికి మేలు చేకూరడంతో పాటు మానవాళికి నాణ్యమైన ఆహారం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఓ నాగార్జున్ రెడ్డి, సర్పంచ్ రూపదేవి, ఏఈఓలు నీలిమ, శిరీష, శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు.
వాణిజ్య ఒప్పందాన్ని
రద్దు చేయండి
అయిజ: కేంద్ర ప్రభుత్వం రైతులకు కీడుచేసే విధంగా చేసుకున్న అమెరికా, భారత్ వ్యవసాయ వాణిజ్య ఒప్పందాన్ని వెంటనే రద్దుచేయాలని తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాల్ డిమాండ్ చేశారు. మంగళవారం అయిజలో వివిధ సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించి.. నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్న కేంద్రం.. వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవడానికి జీరో పన్ను చేసి, దేశ రైతాంగాన్ని తీవ్రంగా నష్టపరుస్తున్నారని ఆరోపించారు. రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేకమైన 2025 విద్యుత్ సవరణ బిల్లు, విత్తన బిల్లును రద్దుచేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కార్మిక వ్యతిరేక నిర్ణయాలను ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో టీపీఎప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


