పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం గ్రామ సమీపం నుంచి ఆంధ్రప్రదేశ్లోని కొత్తపల్లి మండలం సంగమేశ్వరం వరకు కృష్ణానది మీదుగా ఐకానిక్ బ్రిడ్జి నిర్మిస్తారు. ఈ ప్రాంతం మొత్తం నల్లమల అటవీ ప్రాంతంలోనే ఉంది. అదేవిధంగా వంతెనకు అనుసంధానంగా జాతీయ రహదారి నిర్మించే ప్రాంతాల్లోనూ అటవీ భూములు ఉన్నాయి. కొల్లాపూర్ నుంచి ఐకానిక్ బ్రిడ్జి నిర్మించే వరకు మొత్తం 53 హెక్టార్ల భూమి ఉండగా.. అందులో 25 హెక్టార్ల భూమి అటవీ ప్రాంతంలోనిది. అటవీ శాఖ నుంచి భూమిని సేకరించేందుకు రెవెన్యూ అధికారులు భూ బదలాయింపు ప్రక్రియ చేపట్టారు. అమ్రాబాద్ సమీపంలో రెవెన్యూ భూమి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. దీంతో గతేడాది అక్టోబర్ 28న రాష్ట్ర ఫారెస్టు అధికారులు, ఈ ఏడాది ఫిబ్రవరి 21న సెంట్రల్ ఫారెస్టు అధికారుల బృందం అటవీ భూమిలో జాతీయ రహదారి నిర్మించబోయే ప్రాంతాలను పరిశీలించి కేంద్రానికి నివేదిక పంపారు. మార్చి మొదటి వారంలో అటవీ భూముల బదలాయింపునకు కేంద్రం క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో బ్రిడ్జి నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.


