గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు సోమవారం 2,428 క్వింటాళ్ల వేరుశనగ రాగా గరిష్టంగా రూ.8,020, కనిష్టంగా రూ.2,821, సరాసరిగా రూ.5,149 ధరలు లభించాయి. అలాగే 164 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ.6,179, కనిష్టంగా రూ.3,419, సరాసరిగా రూ.6,179 చొప్పున పలికాయి. 29 క్వింటాళ్ల కంది రాగా.. గరిష్టంగా రూ.7,089, కనిష్టంగా రూ.6,759, సరాసరిగా రూ.7,069 చొప్పున ధరలు వచ్చాయి.
పంట మార్పిడితో అధిక దిగుబడులు
గోపాల్పేట: పంటల సాగులో సేంద్రియ ఎరువుల వినియోగం, పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు సాధించవచ్చని కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్త రాజేందర్రెడ్డి రైతులకు సూచించారు. సోమవారం గోపాల్పేట రైతువేదికలో డీఏఓ ఆంజనేయులుగౌడ్తో కలిసి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త మాట్లాడుతూ.. రైతులు సహజసిద్ధంగా లభించే మక్కిన పశువుల ఎరువులు, జీవామృతం, నీమాస్త్రం, దశపత్రి తదితర కషాయాలతో పంటల్లో చీడపీడలను నివారించవచ్చన్నారు. ఏటా ఒకే రకం పంటను వానాకాలం, యాసంగి సీజన్లో పండించకూడదని.. భూసార పరీక్షలకు అనుగుణంగా పంటమార్పిడి విధానం పాటించాలని సూచించారు.
గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం
అమరచింత: కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలపేతం చేయడానికే నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని డీసీసీ అధ్యక్షుడు, శాట్ చైర్మన్ శివాసేనారెడ్డి అన్నారు. సోమవా రం అమరచింతలోని పార్టీ కార్యాలయ ఆవరణలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిది కేశం నాగరాజ్గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండలస్థాయి సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు హాజరై మాట్లాడారు. మునుపెన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ, మండల అధ్యక్షులకు మరిన్ని అధికారాలు కల్పించేందుకు సీఎం రేవంత్రెడ్డి కార్యాచరణ రూపొందించారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని.. గ్రామాల్లో సర్పంచులతో పాటు పార్టీ అధ్యక్షుడికి సైతం అదే స్థాయిలో అధికారాలు కట్టబెట్టేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామంలో ఎవరికి అందించాలనే పూర్తి స్వేచ్ఛ గ్రామ పార్టీ అధ్యక్షుడికి అప్పగిస్తున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ.. పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమించే నాయకుడిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని సూచించారు. అనంతరం నాగరాజ్గౌడ్ మాట్లాడుతూ.. పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే ఉపేక్షించేది లేదన్నారు. వారిని పార్టీ నుంచి బయటికి పంపిస్తామన్నారు. గత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ లైన్కు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చర్యలు తప్పవన్నారు.


