అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్రాన్ని బుధవారం స్థానిక జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మిథున్ తేజతో కలిసి రాజస్తాన్ హైకోర్టు జడ్జి జస్టిస్ యాగేంద్రకుమార్ పురోహిత్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీబాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబ అమ్మవారిని వారు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు వారిని శేషవస్త్రాలతో సత్కరించగా.. అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలను అందజేసి, వేద ఆశీర్వచనం పలికారు. న్యాయమూర్తుల వెంట స్థానిక తహసీల్దార్ ప్రభాకర్, ఆలయ అధికారి ప్రదీప్, కోర్టు సిబ్బంది చిన్న రాజు ఉన్నారు.
డిజిటల్ క్రాప్ సర్వేవేగవంతం చేయాలి
ఉండవెల్లి: డిజిటల్ క్రాప్ సర్వేను వేగవంతంగా పూర్తిచేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప అన్నారు. బుధవారం ఉండవెల్లి, భైరాపురం, డి.బూడిదపాడు, పుల్లూరు గ్రామాల్లో డిజిటల్ క్రాప్ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. వలంటీర్లు క్షేత్రస్థాయిలో పంట పొలాలను సందర్శించి పంటల వివరాలను నమోదు చేయాలన్నారు. ప్రతి క్లస్టర్లో వలంటీర్ల సర్వే తీరును ఏఈఓలు, ఏఓలు పరిశీలించాలని సూచించారు. అదే విధంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా త్వరగా పూర్తిచేయాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హచ్చరించారు. అనంతరం అలంపూర్ చౌరస్తాలో మన గ్రోమర్ సెంటర్లో ఎరువుల స్టాక్, రికార్డులను పరిశీలించారు. డీఏఓ వెంట ఏఓ అనిత, ఏఈఓ హసినా ఉన్నారు.
వేరుశనగ క్వింటా రూ.9,341
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు బుధవారం 663 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 9,341, కనిష్టంగా రూ. 4,329, సరాసరి రూ. 6500 ధర పలికింది. అదే విధంగా 7 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,236, కనిష్టంగా రూ. 6,829, సరాసరి రూ. 6886 ధర లభించించి. 23 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టం రూ. 6,129, కనిష్టంగా రూ. 5,619, సరాసరి రూ. 6,019 ధర పలికింది.


