రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరి
గద్వాల క్రైం: వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా పోలీసుశాఖ ఈ నెల 22 నుంచి రెండో దశ అరైవ్.. అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా గద్వాల, అలంపూర్, అయిజ, మానవపాడు, ఇటిక్యాల, శాంతినగర్, ధరూరు, మల్దకల్ తదితర మండలాల్లో పోలీసు సిబ్బంది వాహనాదారులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ట్రాఫిక్ నియమాలపై వాహనదారుల్లో అవగాహన పెంపొందించడం, సురక్షిత ప్రయాణం కల్పించడమే అరైవ్.. అలైవ్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. వారం రోజులపాటు అవగాహన కార్యక్రమా లు నిర్వహించనున్నట్లు తెలిపారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించి.. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. మరోవైపు డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు.


