నేరస్తులపై నిఘా పెంచాలి
గద్వాల క్రైం: కేసుల విచారణపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సృజన అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గద్వాల, అలంపూర్, శాంతినగర్ సర్కిల్ పరిధిలో ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి, నేరస్తులు ఎంత మంది, చార్జిషీట్ దాఖలు తదితర అంశాలపై ఆరా తీశారు. ఇసుక, మట్టి అక్రమ తరలింపు, చట్ట వ్యతిరేక కార్యకలపాలపై నిఘా ఉంచాలని, ఇలాంటి పనులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల వద్ద ప్రత్యేక తనిఖీ చేపట్టాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. డయల్ 100 విషయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, నిత్యం గస్తీ, పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఎస్పీ రంగస్వామి, సీఐలు పాల్గొన్నారు.