కదిలిస్తే కన్నీళ్లే.. | - | Sakshi
Sakshi News home page

కదిలిస్తే కన్నీళ్లే..

Sep 21 2026 12:56 AM | Updated on Sep 21 2026 12:56 AM

వానాకాలంపై వరుణుడి చిన్నచూపు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: వరుణుడు ముఖం చాటేసినా.. రైతు మాత్రం సాగును వీడలేదు. చినుకు కోసం ఆకాశం వైపు చూస్తూనే.. పంటను కాపాడుకునేందుకు చెమటోడుస్తున్నాడు. వర్షాభావం, కరెంట్‌ కోతలు వెంటాడుతున్నా పంటలు పండుతాయనే ధీమాతో ఉన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో రైతులను కదిలిస్తే చాలు కన్నీళ్లే వస్తున్నాయి. ఉమ్మడి వరంగల్‌లో ఈ వానాకాలం పరిస్థితి దారుణంగా మారింది. వ్యవసాయశాఖ తాజా గణాంకాలు సాగు పరిస్థితి, రైతు పట్టుదలకు అద్దం పడుతోంది. ఆరు జిల్లాల్లో సాధారణ సాగు విస్తీర్ణం 15.93 లక్షల ఎకరాలు కాగా.. గురువారం నాటికి 14.34 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అంటే దాదాపు 90 శాతం సాగు పూర్తయింది. ఇదే సమయంలో సాధారణంగా కురవాల్సిన 4,763.6 మిల్లీమీటర్ల వర్షపాతానికి 3,516.9 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. మొత్తంగా 26.2 శాతం లోటు వర్షపాతం నెలకొంది.

పత్తి వైపే రైతు మొగ్గు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణాన్ని మించి 102 శాతం సాగు నమోదవడం గమనార్హం. ములుగు జిల్లాలో మాత్రం 80 శాతంతో అత్యల్ప సాగు నమోదైంది. వర్షాభావ ప్రభావం వరి సాగుపై స్పష్టంగా కనిపిస్తోంది. ఆరు జిల్లాల్లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 9,21,445 ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 6,77,538 (73.5 శాతం) ఎకరాల్లోనే సాగైంది. నీటి లభ్యతపై అనిశ్చితి, వర్షాల కొరత కారణంగా వరి సాగు సాధారణ లక్ష్యానికి ఇంకా దూరంగానే ఉంది. సాగునీటి వనరులపై ఎక్కువగా ఆధారపడే పంట కావడంతో నీటి పరిస్థితిని బట్టి రైతులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు పత్తి సాగు మాత్రం సాధారణ లక్ష్యాన్ని దాటింది. ఉమ్మడి వరంగల్‌లోపత్తి సాధారణ సాగు విస్తీర్ణం 5,54,387 ఎకరాలు కాగా.. 5,62,162 (101.4 శాతం) ఎకరాల్లో సాగైంది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10,18,774 ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 8,48,193 (83.3 శాతం) ఎకరాల్లో సాగు నమోదైంది.

చినుకు కోసం ఎదురుచూపు..

వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. బోర్లు, బావులు, ఇతర నీటి వనరుల సాయంతో పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వర్షాభావం అధికంగా ఉన్న హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. హనుమకొండలో సాధారణ వర్షపాతం 730.1 మిల్లీమీటర్లు కాగా 422.9 మిల్లీమీటర్లు మాత్రమే నమోదై 42.1 శాతం లోటు ఏర్పడింది. వరంగల్‌లో సాధారణ వర్షపాతం 773.6 మిల్లీమీటర్లు కాగా 484 మిల్లీమీటర్లు నమోదై 37.4 శాతం లోటు కనిపించింది. వర్షాభావ ప్రభావం భూగర్భజలాలపైనా కనిపిస్తోంది. ఈ నెల మొదటి పక్షం నాటికి జిల్లాలవారీగా భూగర్భజల మట్టం ఇలా నమోదైంది.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 10.22 మీటర్ల లోతు కాగా, జనగామలో 9.50 మీటర్లు, హనుమకొండలో 6.83 మీటర్లుగా నమోదైంది. అలాగే, వరంగల్‌లో 6.28 మీటర్లు, ములుగులో 5.13 మీటర్లు, మహబూబాబాద్‌ జిల్లాలో 4.70 మీటర్లుగా భూగర్భ జలమట్టం ఉంది. ఒకవైపు 26.2 శాతం వర్షాభావం.. మరోవైపు 90 శాతానికి చేరిన సాగు. వరి సాగు లక్ష్యానికి ఇంకా దూరంగా ఉన్నా.. పత్తి మాత్రం సాధారణ విస్తీర్ణాన్ని దాటింది.

ఈ ఫొటోలోని రైతు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం చంటయ్యపల్లికి చెందిన భూక్య భోజ్య. సొంత భూమి నాలుగెకరాలకు తోడు ఆరు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఆరు ఎకరాల్లో కంది, మిర్చి, నాలుగు ఎకరాల్లో వరి వేశాడు. కౌలు, పెట్టుబడి కలిస్తే ఇప్పటికే రూ.2 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. వర్షం కురుస్తుందన్న ఆశతో పంటలు వేశాడు. ప్రస్తుత ఎల్‌నినో ప్రభావం, కరెంట్‌ కోతతో పరిస్థితి దిక్కుతోచని విధంగా మారిందని రైతు భోజ్య ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ ఫొటోలోని రైతు హనుమకొండ జిల్లా నడికూడ శివారుకు చెందిన జవ్వాజి ప్రవీణ్‌కుమార్‌. ఈయన తనకున్న మూడు ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నాడు. వర్షాలు లేకపోవడంతో సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ప్రస్తుతానికి సమీపంలోని రైతుకు చెందిన బావి నీటిని వాడుతున్నాడు. సరిపడా నీరు అందకపోవడంతో వరి పంట ఎదుగుదల లేదు. దీంతో దిగుబడి వస్తుందో రాదో అని రైతు ప్రవీణ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. వర్షాలు పడకపోతే పంటను వదిలేసే పరిస్థితి కూడా రావచ్చని అన్నాడు.

వర్షాభావం, విద్యుత్‌ కోతలతో

రైతులు సతమతం

ఆరు జిల్లాల్లో 26.2 శాతం వర్షాభావం

14.34 లక్షల ఎకరాల్లో పంటలు

ఉమ్మడి వరంగల్‌లో 90 శాతం సాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement