కాళేశ్వరం: నేడు (సోమవారం) గణపతి షడక్షరి సహిత లక్ష్మీగణపతి మూలమంత్ర హవనం నిర్వహించనున్నట్లు కాళేశ్వరాలయం చైర్మన్ అవధాని మోహన్శర్మ, ఈఓ మహేశ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కాళేశ్వరముక్తీశ్వర స్వామి అనుబంధ ఆలయం శ్రీ ఆది ముక్తేశ్వర స్వామి వారి బాలాలయం వద్ద నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
శ్రీనివాసరావుకు
ఉత్తమ సేవా పురస్కారం
భూపాలపల్లి రూరల్/చిట్యాల: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ లీడర్ వాసినేని శ్రీనివాసరావు (సింగరేణి ఉద్యోగి)కు భారత్ రక్తదాన్ సేవా మిషన్ అసోసియేషన్ నిర్వాహకులు ఉత్తమ సేవా పురస్కారం అందించారు. భువనగిరి యాదాద్రి జిల్లాలో ఆదివారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అవార్డు అందించారు. పేద, అనాథ, వృద్ధులకు సాయం, ఆశ్రమాలలో భోజనం ఏర్పాటు, మొక్కటు నాట డం, రక్తదానం కార్యక్రమాలకు గానూ అవార్డు అందించారు. 75 సార్లు రక్తదానం చేసినందుకుగానూ చిట్యాల మండలం జడలపేట ప్రభుత్వ ఉపాధ్యాయుడు కామిడి సతీష్రెడ్డికి జాతీయ ఉత్తమ రక్తదాతఅవార్డు అందించారు.
రామప్పను సందర్శించిన అమెరికా దేశస్తుడు
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని అమెరికా దేశానికి చెందిన మాట్లండ్ ఆదివారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని ఆయన దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు.
లక్నవరంలో పర్యాటకుల సందడి
గోవిందరావుపేట: మండల పరిధిలోని లక్నవరంలో పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సందర్శకులు సరస్సు అందాలను వీక్షించారు. అనంతరం బోటు షికారుతో పాటు జిప్లైన్పై సైక్లింగ్ చేస్తూ ఉత్సాహంగా గడిపారు. సరస్సు చుట్టూ ఉన్న పచ్చని కొండలు, నీటి అందాలను ఆస్వాదిస్తూ బోటులో ప్రయాణించడంపై పర్యాటకులు ఆనందంగా గడిపారు.
రూ.85వేల సైబర్ మోసం
కొత్తగూడ: సైబర్ నేరగాళ్లు ఓ యువకుడి బ్యాంకు ఖాతా నుంచి రూ.85వేలు కొల్లగొట్టిన సంఘటన మండల కేంద్రంలో ఆదివారం వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన షేక్ ఆసిఫ్ వాట్సాప్కు ఓ ఏపీకే ఫైల్ వచ్చింది. అనుకోకుండా టచ్ కావడంతో వివిధ నంబర్ల వాట్సాప్కు ఆ ఏపీకే ఫైల్ వెళ్లడంతో పాటు షేక్ ఆసిఫ్ అకౌంట్ నుంచి రూ.85వేలు బదిలీ అయినట్లు మెసేజ్ వచ్చింది. కాగా, అప్రమత్తమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. సైబర్ క్రైం కేసు నమోదు చేసి, బాధితుడి అకౌంట్ హోల్డ్లో పెట్టినట్లు ఎస్సై రాజ్కుమార్ తెలిపారు.


