● ముగిసిన నిట్ 24వ కాన్వొకేషన్
● పట్టాలు అందుకున్న 1,067 మంది పీజీ విద్యార్థులు
● డిగ్రీ పట్టాలందించిన నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ బీవీఆర్ మోహన్రెడ్డి
● డైరెక్టర్ గోల్డ్ మెడల్ సాధించిన
ఆడెపు అంజలి, జలుమేడి భరణి
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఆదివారం నిట్ 24వ స్నాతకోత్సవ సంబురం అట్టహాసంగా ముగిసింది. పీజీ పట్టాలందుకున్న విద్యార్థులు ఆకాశమే హద్దుగా ఆనందోత్సాహంతో మెడలోని కండువాలు ఎగురవేశారు. పీజీ, పీహెచ్డీ పూర్తి చేసుకున్న 1,067 మంది విద్యార్థులు ఆదివారం డిగ్రీ పట్టాలను బోర్డ్ ఆఫ్ గవర్నర్, సియాంట్ వ్యవస్థాపకుడు డాక్టర్ బీవీఆర్ మోహన్రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. తొలిరోజు శనివారం టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంతోశ్కుమార్ చేతుల మీదుగా 945 మంది యూజీ విద్యార్థులు అందుకున్నారు. రెండు రోజుల స్నాతకోత్సవంలో మొత్తం 1,997 మంది డిగ్రీ పట్టాలు అందుకున్నారు.
నిట్ విద్యార్థులు ప్రత్యేకం
సమాజంలో నిట్ విద్యార్థులు ప్రత్యేకంగా నిలవాలని, పీజీ పూర్తి చేసుకున్న వారి కోసం దేశం ఎదురుచూస్తోందని నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్, సియాంట్ వ్యవస్థాపకుడు డాక్టర్ బీవీఆర్.మోహన్రెడ్డి తెలిపారు. నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతూ పరిశ్రమల్లో అనుభవాన్ని సాధించి, స్వయంగా పరిశ్రమలను ఏర్పాటు చేసి తోటి విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు.
బాధ్యత నిర్వర్తించే సమయమిది..
విద్యార్థి దశ పూర్తి చేసుకుని డిగ్రీ పట్టాలందుకున్న విద్యార్థులకు పట్టాలతో తమ తల్లిదండ్రులు కన్నకలల బాధ్యతను నిర్వహించే సమయం వచ్చిందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. నిట్లోని అత్యాధునిక బోధన, సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని డిగ్రీ పట్టాలను అందుకున్న పీజీ విద్యార్థులు తాము నిట్ జెన్ జీ అనేలా ఆవిష్కరణలు చేపట్టాలన్నారు.


