కనులవిందుగా పంబారట్టు
● మార్మోగిన అయ్యప్ప నామస్మరణ
కాటారం: కాటారం మండలకేంద్రంలో శుక్రవారం అయ్యప్పస్వామి పంబారట్టు కార్యక్రమం కనులవిందుగా కొనసాగింది. శ్రీ ఆనంద ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలోని ఉత్సవ విగ్రహాన్ని రథంలో ఎక్కించి ఆలయం నుంచి గారెపల్లి చౌరస్తా మీదుగా పురవీధుల గుండా తిప్పుతూ అత్యంత వైభవోపేతంగా శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలకగా భక్తులు మొక్కులు సమర్పించారు. అయ్యప్ప మాలాధారణ స్వాములు, భక్తిపాటలు పాడుతూ నృత్యాలు చేశారు. అనంతరం పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలోని త్రివేణి సంగమ గోదావరి నదిలో స్వామివారి ఉత్సవ విగ్రహానికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు బచ్చు అశోక్గుప్తా, ఆలయ అర్చకులు గుండూరి భానుప్రసాద్శర్మ, జీవీ శాస్త్రి, ఆలయ కమిటీ బాధ్యులు పీచర రామకృష్ణారావు, మద్ది నవీన్, అయిత వెంకన్న, పెండ్యాల రంజిత్కుమార్, జక్కు మొగిలి, పసుల రాంచంద్రం, గంగిరెడ్డి లచ్చిరెడ్డి, ముస్కమల్ల సత్యం, మాలాధారణ స్వాములు పాల్గొన్నారు.


