
ఉచిత విద్య అవకాశాన్ని వినియోగించుకోవాలి
భూపాలపల్లి అర్బన్: పిపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్లో అందిస్తున్న ఉచిత కార్పొరేట్ స్థాయి విద్యను జిల్లాలోని విద్యార్థులు వినియోగించుకోవాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నక్క తిరుపతి, కొత్త కుమారస్వామి తెలిపారు. జిల్లా కేంద్రంలోని శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించే లక్ష్యంతో ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 4, 5 ,6 తరగతి విద్యార్థులు అర్హత పరీక్ష రాసి 5, 6, 7 తరగతుల్లో ప్రవేశం పొందాలని సూచించారు. 80 మార్కులతో ఈ ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలుగు, గణితం, ఆంగ్లం పరిసరాల విజ్ఞానం నుంచి ప్రశ్నలు ఉంటాయని పేర్కొన్నారు. అర్హత పొందిన విద్యార్థులకు వారు ప్రవేశం పొందిన తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతోపాటు ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తారని తెలిపారు. గ్రామీణ నిరుపేదలు, తల్లిదండ్రులు లేని విద్యార్థులు అర్హులని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. వెబ్సైట్ http:// forms. gle/ uhxD4 Dj8 oyxMUdPM7లో గూగుల్ ఫామ్ నింపి పేరు నమోదు చేసుకోవాలని, వివరాలకు 99124 62762, 95534 05934, 99491 74837 నంబర్ల ద్వారా సంప్రదించాలని కోరారు. సమావేశంలో యూనియన్ నాయకులు సల్ల సంపత్, సుకుమార్, సరిత పాల్గొన్నారు.