
నేడు డయల్ యువర్ డీఎం
భూపాలపల్లి అర్బన్: నేడు(శుక్రవారం) డయల్ యువర్ ఆర్టీసీ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎం ఇందు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని వ్యాపారస్తులు, విద్యార్థులు, ఉద్యోగులు మధ్యాహ్నం 12గంటల నుంచి 1 గంట వరకు 99592 26707 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. ఆర్టీసీ సమస్యలు సూచనలు, సలహాలు తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
ముక్తివనం పార్కులో
మంటలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని ముక్తివనం పార్కులో గురువారం మంటలు చెలరేగాయి. కాళేశ్వరం దర్శనానికి వచ్చిన భక్తులు పార్కు వెనుకాల వంటలు చేసుకొని నిప్పును వదిలేశారు. దీంతో భారీగా పొగతో పాటు మంటలు ఎగిసిపడ్డాయి. అటవీశాఖ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. ఫైర్ బ్లోయర్స్తో మంటలను బీట్ అధికారి శ్రీలత, వాచర్స్ ఆర్పేశారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
అక్రమ నిర్మాణాల కూల్చివేత
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని గడ్డగానిపల్లి గ్రామంలో అక్రమంగా నిర్మిస్తున్న ఇళ్లను అధికారులు గురువారం తెల్లవారు జామున కూల్చేశారు. ఓపెన్కాస్ట్–2 ప్రభావిత గ్రామమైన గడ్డిగానిపల్లిలో నష్ట పరిహారం పొందేందుకు గ్రామస్తులు అనుమతి లేకుండా సుమారు 48 నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ, మున్సిపల్, సింగరేణి, పోలీసులు జేసీబీలతో కూల్చేశారు.
కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు సంఘం (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో గురువారం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం భూపాలపల్లి బ్రాంచ్ కమిటీని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంపేటి రాజయ్య ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ కార్మికులకు తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో అనేక హామీలు ఇచ్చినప్పటికీ నెరవేర్చడం లేదన్నారు. కోలిండియా వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా పట్టించుకోవడం లేదన్నారు. ఏరియా నూతన బ్రాంచ్ కమిటీ అధ్యక్షుడిగా మడికొండ స్వామి, కార్యదర్శిగా సుధాకర్లను నియమించినట్లు తెలిపారు.
ఎదిర పీహెచ్సీ పరిశీలన
వెంకటాపురం(కె): మండల పరిధిలోని ఎదిర వైద్యశాలతో పాటు చొక్కాల, వెంకటాపురం సబ్ సెంటర్లను గురువారం జిల్లా క్వాలిటీ మేనేజర్ శరత్, క్వాలిటీ మోనిటర్ సాయిచంద్లు పరిశీలించారు. వైద్యశాలలో రోగులకు అందుతున్న వైద్య సేవలను, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య సిబ్బందికి జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలపై ఒక్కరోజు శిక్షణ తరగతులను నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు స్నేహారెడ్డి, పవన్, సిబ్బంది యాకలక్ష్మి, రామలక్ష్మి, సత్యనారాయణ పాల్గొన్నారు.