● పలు డిమాండ్ల పరిష్కారం కోరుతూ
కలెక్టరేట్ ఎదుట నిరసన
● అదనపు కలెక్టర్కు వినతిపత్రం
జనగామ: రాష్ట్ర రైస్ మిల్లర్ల కమిటీ పిలుపు మేరకు జిల్లాలో రైస్ మిల్లర్లు మిల్లింగ్ ప్రక్రియను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్ బెన్షాలోమ్కు వినతి పత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 30 మంది రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. రైస్ మిల్లర్ల కమిటీ పేర్కొన్న డిమాండ్లు, సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రంలో వివరించారు. మిల్లింగ్ చేసిన ధాన్యానికి అనుగుణంగా బియ్యం ప్రొక్యూర్మెంట్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తగిన చర్యలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. మిల్లింగ్ చేసిన ధాన్యంలో డ్యామేజ్, నూకలు, తదితర కారణంగా 15 నుంచి 20 శాతం వరకు వచ్చే తరుగు (షార్ట్ఫాల్)ను పీవీ చేసినప్పటికీ అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపించారు. దీంతో సివిల్ సప్లయీస్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో మిల్లింగ్ ప్రక్రియ కొనసాగించడం కష్టంగా మారిందని తెలిపారు.
ప్రధాన డిమాండ్లు
సీఎంఆర్ అగ్రిమెంట్ ఇబ్బందులకు ఆమోదయోగ్యంగా ఉండేలా రూపొందించాలని, టన్నీ మిల్లింగ్ విధానానికి సంబంధించి బాయిల్డ్, రబీ పంటలకు వేర్వేరుగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. క్వింటాల్ ధాన్యానికి మిల్లింగ్ ఛార్జీని రూ.150కు పెంచాలని, పాత గన్నీ బ్యాగ్ ధరను రూ.11గా నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. 2014 నుంచి రావాల్సి న సివిల్ సప్లయీస్ మిల్లింగ్, ట్రాన్స్పోర్ట్, డ్రైయేజ్, కన్సిడియేషన్ చార్జీలను వెంటనే చెల్లించాలని, తమ సమస్యలను సానుకూలంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని రైస్ మిల్లర్లు కోరారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు మిల్లింగ్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు అదనపు కలెక్టర్కు ఇచ్చిన వినతిలో స్పష్టం చేశారు.


