● గణేష్ మండపాలు,
నిమజ్జన మార్గాల్లో తనిఖీలు
● ఎన్పీడీసీఎల్ అధికారుల ప్రత్యేక దృష్టి
జనగామ: వినాయక చవితి వేడుకల్లో విద్యుత్ ప్రమాదాల నివారణకు ఎన్పీడీసీఎల్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పండుగ నేపథ్యంలో గణేష్ మండపాలు, విద్యుత్ అలంకరణ ప్రాంతాలు, విగ్రహాల తరలింపు, నిమజ్జన మార్గాల్లో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా అందించనున్నారు. విద్యుత్తు శాఖ ఆధ్వర్యంలో మండపాల వివరాలను క్షేత్రస్థాయి అధికారులు సేకరిస్తూ, అవసరమైన విద్యుత్ లోడ్ను అంచనా వేస్తున్నారు. నాణ్యమైన ఐఎస్ఐ గుర్తింపు కలిగిన వైర్లు, పరికరాలను మాత్రమే ఉపయోగించాలని, తగిన సామర్థ్యం కలిగిన ఎంసీబీ, ఆర్సీసీబీ, ఈ ఎల్సీబీ వంటి రక్షణ పరికరాలను ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీలకు వివరిస్తున్నారు. విద్యుత్ స్తంభాలపై టీవీ కేబుల్, ఇంటర్నెట్ తదితర కమ్యూనికేషన్న్ వైర్లు గజిబిజిగా లేకుండా సంబంధిత ప్రొవైడర్లతో సమన్వయం చేసుకోవాలని క్షేత్ర స్థాయి అధికారులను ఆదేశించారు.


