జనగామ: విద్యా వ్యవస్థలో అంతర్జాతీయ స్థాయి ఉత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్’కు జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతలో 33 మంది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను ఫిన్లాండ్ పర్యటనకు ఎంపిక కాగా జిల్లా నుంచి ఇద్దరు ఉన్నారు. రఘునాథపల్లి మండలం మండెలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్.రాజపాల్రెడ్డి(గెజిటెడ్ హెచ్ఎం)ఫేజ్–1 పరిధిలో ఎంపిక కాగా, చిల్పూరు మండలం పల్లగుట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న కె.నీలిమ ఫేజ్–2 పరిధిలో ఎంపిక అయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ఉపాధ్యాయులు ఫిన్లాండ్, సింగపూర్, వియత్నాం, జపాన్ దేశాల్లో పర్యటించాల్సి ఉండగా, ప్రస్తుత విడతలో 40 మంది ప్రతినిధుల (ఉపాధ్యాయులు, అధికారుల బృందం ఈ నెల 26 నుంచి వచ్చే నెల 3 వరకు ఫిన్లాండ్లో పర్యటించనున్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్య అందిస్తున్న నాకు ఈ అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని ఉపాధ్యాయురాలు నీలిమ చెప్పారు. ఫిన్లాండ్ పర్యటనకు ఎంపిక కావడంపై ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్, ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, సభ్యులు నీలిమకు అభినందనలు తెలిపారు.
అంతర్జాతీయ విద్య అధ్యయనానికి ఎంపిక
ఈనెల 26 నుంచి అక్టోబర్ 3 వరకు పర్యటన


