స్టేషన్ఘన్పూర్: మండలంలోని సముద్రాల గ్రామంలో ప్రకృతి సంపద అయిన పంచరాయి గుట్టలను అక్రమార్కుల నుంచి రక్షించాలని గ్రామానికి చెందిన గొర్రెల, మేకల పెంపకందార్లు, యాదవ సంఘం జిల్లా నాయకులు తాటికొండ యాదగిరి, కత్తుల రాజు డిమాండ్ చేశారు. గ్రామ శివారులో ఏదులబోడు వద్ద గొర్రెల, మేకల పెంపకందారులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ శివారులో 189 సర్వేనంబర్లో పంచరాయి భూములు, గుట్టల్లో తమ తాతల కాలం నుంచి గొర్రెలు, మేకలను మేపుతూ జీవనం సాగిస్తున్నామన్నారు. ఇటీవల కొందరు గుర్తు తెలియని అక్రమార్కులు ఆయా పంచరాయిగుట్టలపై ఉన్న చెట్లను తొలగించారని, అక్రమంగా మొరంను కొల్లగొట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఈ విషయమై కలెక్టర్, రెవెన్యూ అఽధికారులు తక్షణమే స్పందించాలని, అక్రమార్కుల నుంచి సముద్రాల పంచరాయి గుట్టలను రక్షించాలని కోరారు. కార్యక్రమంలో గొర్రెలు, మేకల పెంపకందారులు బండి అశోక్, మేకల కొమురయ్య, ఎల్.ఎల్లయ్య, బండి రాములు, తాటికొండ నాగరాజు, కన్నెబోయిన అంజయ్య, కత్తుల మల్లయ్య, అశోక్, నాంపల్లి తదితరులు పాల్గొన్నారు.


