జనగామ: పట్టణంలో రైల్వేస్టేషన్ నుంచి ఆర్టీసీ చౌరస్తా జంక్షన్ వరకు ఫుట్పాత్లపై వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాల నివారణకు పోలీసులు శాఖ పరమైన చర్యలు చేపట్టారు. ఫుట్పాత్లు, రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని ట్రాఫిక్ పోలీసులు వెనక్కి జరుపుతున్నారు. సీఐ సత్యనారాయణరెడ్డి పర్యవేక్షణలో హెడ్కానిస్టేబుల్ హిదాయత్ అలీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు రోజువారీగా ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఫుట్పాత్లపై వ్యాపారాలు నిర్వహించడంతో వాహనదారులతో పాటు పాదాచారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వ్యాపారులు తమ దుకాణాలను వెనక్కి జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. పాదాచారులు సురక్షితంగా రాకపోకలు సాగించేలా ఫుట్పాత్లను అందుబాటులో ఉంచడంతో పాటు వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా ఈ చర్యలను నిరంతరం కొనసాగిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.


