● ఉల్లిగడ్డ కిలో రూ.60.. చక్కెర కిలో రూ.70
● ధరల మంటతో సామాన్యుల బెంబేలు
జనగామ: సామాన్యులపై నిత్యావసర సరుకుల ధరల భారం మరింత పెరుగుతోంది. నిత్యం వినియోగించే చక్కెర, ఉల్లిగడ్డ ధరలు ఒక్కసారిగా పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో ఉల్లిగడ్డ ధర కిలోకు రూ.25 నుంచి రూ.60కు చేరగా, చక్కెర ధర రూ.40 నుంచి రూ.70కు పెరిగింది. దీంతో ఉల్లిగడ్డపై రూ.35, చక్కెరపై రూ.30 మేర భారం పడింది. ఇటీవల కొద్ది రోజుల వ్యవధిలోనే ధరలు వేగంగా పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.
ఉదయం ఒక రేటు...సాయంత్రం మరో ధర
మార్కెట్లో ఉదయం ఉన్న ధర సాయంత్రానికి మారుతున్న పరిస్థితి నెలకొందని వ్యాపారులు చెబు తున్నారు. గతంలో కిలోకు కొద్దిపాటి పెరుగుదల కనిపించేది. ప్రస్తుతం ఒకేసారి రూ.10, రూ.20 చొప్పున ధరలు పెరుగుతుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలు ఒక్కసారిగా పెరుగుతున్న నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు హోల్సేల్, రిటైల్ మార్కెట్లలో తనిఖీలు నిర్వహించి నిల్వలు, కొనుగోలు ధరలు, విక్రయ ధరలను పరిశీలించాలని వినియోగదారులు కోరుతున్నారు. కాగా చక్కెరను సబ్సిడీతో రేషన్ దుకాణాల్లో తెల్లకార్డుల లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
గానుగుపహడ్లో మద్యపాన నిషేధం
జనగామ రూరల్: మండలంలోని గానుగుపహడ్ గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసేందుకు తీర్మానించినట్లు సర్పంచ్ శానబోయిన అనూష మహిపాల్ తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ..వచ్చే నెల 10వ తేదీలోగా గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తూ తీర్మానం చేశామని, గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే రూ.50వేల జరిమానాతో పాటు పథకాలు రద్దు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఉపసర్పంచ్ కొర్ర శంకర్, వార్డు సభ్యుడు కాల్రాం తదితరులు పాల్గొన్నారు.


