జనగామ: మున్సిపాలిటీ ఆదాయ వనరులను పెంపొందించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన పౌర సేవలు అందించేలా సమగ్ర కార్యాచరణ రూపొందించి అమలుచేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ మున్సిపాలిటీకి సంబంధించిన వివిధ విభాగాల పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి ఉన్న ఆదాయ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో పాటు కొత్త ఆదా య వనరులను అన్వేషించాలన్నారు. ఇంటి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్సులు తదితర పన్నుల వసూళ్లలో పురోగతి సాధించాలని, బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పనులను పూర్తి స్థాయిలో మ్యాపింగ్ చేసి వార్డుల వారీగా రూట్ మ్యాప్ రూపొందించి మున్సిపల్ వెబ్సైట్లో పొందుపరచాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తేనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. అర్హులైన దరఖాస్తుదారులకు నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల అనుమతులు జారీ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా లేదా లోపాలు ఉన్న దరఖాస్తులను నిబంధనల ప్రకారం తిరస్కరించాలన్నారు. ట్రేడ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో పురోగతి సాధించాలని, నిబంధనల మేరకు లైసెన్సులు జారీ చేయాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రకటనలపై వసూలు చేసే అడ్వర్టైజ్ చార్జీలను నిబంధనల ప్రకారం పునఃసమీక్షించి అవసరమైన మేరకు రీ–షెడ్యూల్ చేయాలని సూచించారు. సమీక్షలో మున్సిపల్ చైర్పర్సన్ బాలమణిశ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి, మున్సిపల్ మేనేజర్ ప్రభాకర్, డీఈ రాజ్కుమార్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
ప్రజలకు నాణ్యమైన పౌరసేవలు
అందించాలి
సమీక్షలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


